జగన్ ఓకే అన్నా ఆ పదవుల భర్తీపై మెలిక పెడుతున్నపెద్దలు..దేవుడు కరుణించినా పూజారి వరమివ్వట్లేదట!
ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని దక్కించుకుంది. మొత్తం వైసిపి ఊహించని విధంగా 151 ఎమ్మెల్యేలను గెలుచుకుని టిడిపి ని చావు దెబ్బ కొట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీలో కీలకంగా పనిచేసిన చాలా మంది నేతలు పదవులపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.అయితే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మాత్రం పదవుల కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న విషయం ఆదినుండీ అందరికీ అర్ధం అవుతూనే ఉంది. ఇక పెండింగ్ ఉన్న నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని అయితే అందుకు కొంత కాలం ఆగాలని వైసీపీ పెద్దలు జగన్ కు సలహా ఇస్తున్నారని తెలుస్తుంది .
పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల కోసం సీఎం జగన్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్న వైసీపీ నేతలు
మంత్రుల ఎంపిక విషయంలోనే సామాజిక సమీకరణాలను, అన్ని ప్రాంతాలకు సమానంగా ప్రాతినిధ్యం దక్కాలనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని మంత్రులను కేటాయింపు చేసిన జగన్ ఆశపడి భంగపడిన వారికి కీలక నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా వై వి సుబ్బారెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్ గా నటుడు పృద్వి, ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజా, ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గా వాసిరెడ్డి పద్మ లకు అవకాశం కల్పించి కీలక పదవులు భర్తీ చేశారు వైయస్ జగన్. అయితే ఇంకా ఎన్నో పెండింగ్లో ఉన్న పదవుల కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. జగన్ ను ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నారని సమాచారం.
పదవుల భర్తీపై వైయస్ జగన్ సానుకూలంగా ఉన్నా వద్దంటున్న పెద్దలు ... గుర్రుగా ఉన్న నేతలు
జగన్ అమెరికా నుంచి రాగానే మిగిలిన పదవుల భర్తీ పై నిర్ణయం తీసుకుంటారని ఆశావహులు భావిస్తుంటే వైసీపీలో కీలకంగా వ్యవహరించే విజయసాయి లాంటి పెద్దలు ఆ పదవుల భర్తీ ఇప్పుడు చేయొద్దంటూ జగన్ కు సూచిస్తున్నారని సమాచారం. పదవుల భర్తీపై వైయస్ జగన్ సానుకూలంగా ఉన్నా, వారు మాత్రం ఇప్పుడు వద్దు అని తేల్చి చెబుతున్నారట . దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వటం లేదని తెగ బాధ పడుతున్నారట నామినేటెడ్ పోస్ట్ ల కోసం చక్కర్లు కొడుతున్న నేతలు .ఇంకా రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లాలలోనూ, మండలాల్లోనూ పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది . జగన్ వందరోజుల పాలన పూర్తి చేసుకోబోతున్న తరుణంలో పదవులపై ఆశలు పెట్టుకున్న వైసిపి నాయకుల ఆశలపై వైసీపీ పెద్దలు నీళ్లు చల్లుతున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పార్టీని గెలిపించిన వారికే పదవులు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పెద్దలు సూచిస్తున్నారని సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా కష్టపడితేనే అని మెలిక .. ఎన్నికల తర్వాతే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ చెయ్యాలని జగన్ కు సూచన
ఇక ముందే పదవుల పందేరం చేస్తే వారు శ్రద్ధగా పనిచేయరని జగన్ కు చెబుతున్నారని తెలుస్తుంది. ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తేనే అనే మెలిక పెడితే పార్టీ కోసం బాగా కష్ట పడతారు అని భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత మిగిలిన నామినేటెడ్ పదవుల విషయంలో నిర్ణయం తీసుకోవాలని జగన్ కు వైసీపీ కీలక నాయకులు సూచనలు చేస్తున్నారని సమాచారం. అయితే వైసీపీ నేతలు మాత్రం వైసిపి పెద్దల పై గుర్రుగా ఉన్నారు. జగన్ కు నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఉన్నా, సదరు పెద్దలు అడ్డు పడుతుండటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలకు చాలా మందికి నచ్చడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఏపీలో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులు వ్యవహారం ఇప్పట్లో ముందుకు సాగేలాలేదు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకునేలా ఉన్నారని తెలుస్తుంది.