ప్రకాశంలో గెలుపు కోసం ఒక్కతాటిపైకి బాలినేని, వైవీ.. వైసీపీలో చాన్నాళ్ల తర్వాత అరుదైన సీన్..
ఏపీలో స్ధానిక ఎన్నికల సంగ్రామం రాజకీయ పార్టీల్లో సమీకరణాలను వేగంగా మార్చేస్తోంది. ఎన్నికల వేళ ఏ పార్టీ నుంచి ఎవరెప్పుడు జంప్ అవుతారో తెలియక అధినేతలు సతమతమవుతున్న వేళ.. వైసీపీలో నిత్యం అంతర్గత పోరు సాగించే ఇద్దరు కీలక నేతలు ఒక్కటవుతున్నారు. వీరి కృషి ఫలితంగా ప్రకాశం జిల్లా స్ధానిక పోరులో వైసీపీ క్లీన్ స్వీప్ కోసం సిద్ధమవుతోంది. ఆ నేతలెవరు, వారి కథేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ప్రకాశంలో వైసీపీ అంతర్గత పోరు
2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సీటు నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఆ తర్వాత అక్కడ కీలకంగా మారిపోయారు. అప్పటికే జిల్లా రాజకీయాల్లో తనదైన స్ధాయిలో చక్రం తిప్పుతున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పెత్తనాన్ని తగ్గించడంతో పాటు జిల్లావ్యాప్తంగా తన హవా కొనసాగించారు. ఓ దశలో బాలినేని ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలిస్తే తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన వైవీ.. ఆయన ఓటమికి కారణమయ్యారనే వాదన కూడా ఉంది. ఒంగోలులో బాలినేని ఓటమితో సహజంగానే ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గపోరు ముదిరింది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న నేతలను వైవీ, బాలినేని ఇద్దరూ తమవైపుకు తిప్పుకోవడం మొదలుపెట్టారు.
ఇద్దరూ జగన్ కు ఆప్తులే..
వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ జగన్ కు బంధువులే. వైవీ సుబ్బారెడ్డి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడు కాగా... బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్ కుటుంబానికి బంధువే. అంతే కాదు గతంలో వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన బాలినేని.. ఆయన మరణం తర్వాత వైఎస్ లేని మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయలేనంటూ స్వచ్ఛందంగా పదవిని సైతం వదులుకున్న నేత. దీంతో బాలినేని, వైవీల్లో ఎవరూ ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు అనే పరిస్ధితి తయారైంది.
వర్గపోరుతో ప్రకాశం వైసీపీ కుదేలు..
వైవీ సుబ్బారెడ్డి, బాలినేని వర్గాల మధ్య నెలకొన్న వర్గపోరులో జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో ఓటమి పాలవ్వగా.. గెలిచిన మరికొందరు ఎమ్మెల్యేలు సైతం టీడీపీకి ఫిరాయించారు. దీంతో భారీగా ఎస్సీ, రెడ్డి ఓటు బ్యాంకు కలిగిన వైసీపీకి జిల్లాలో కష్టాలు తప్పలేదు. ఈ వ్యవహారం జగన్ వద్దకు వెళ్లినా ఆయన కూడా సమస్యను పరిష్కరించలేని స్ధితికి వెళ్లిపోయింది ఇక్కడి రాజకీయం. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ గట్టెక్కాలంటే వైవీని తప్పించక తప్పని పరిస్ధితి జగన్ కు ఎదురైంది. వైవీని తప్పిస్తే జిల్లాలో వైసీపీ గెలుపు బాధ్యత తాను తీసుకుంటానని బాలినేని ఇచ్చిన హామీ జగన్ పై బాగానే పనిచేసింది.
2019 ఎన్నికలతో మారిన చిత్రం..
2019 ఎన్నికలకు ముందే ఒంగోలు స్ధానం నుంచి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని తప్పించాలని నిర్ణయం తీసుకున్న జగన్ .. టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అయితే ఒంగోలులో బాలినేనిని ఎలాగైనా ఓడించాలని వైవీ వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ వైసీపీ హవాలో ఒంగోలులో బాలినేనితో పాటు ఎంపీ సీటులో మాగుంట కూడా అనాయాసంగా గెలుపొందారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వైవీ పాత్రకు చెక్ పడినట్లయింది. ఆ తర్వాత బాలినేని మంత్రి కూడా కావడంతో ఇక అప్పటి నుంచి బాలినేని హవానే కొనసాగుతోంది.
Recommended Video
స్ధానిక పోరుతో మళ్లీ వైవీ ఎంట్రీ..
తాజాగా స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు మంత్రి బాలినేని సిద్ధమవుతున్న తరుణంలో వైవీ మరోసారి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి జగన్ తనకు మరో బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, గొట్టిపాటి రవిలను వైసీపీలోకి తీసుకొచ్చే పనిని వైవీ తీసుకున్నారు. ఈ దిశగా వైవీ జరిపిన చర్చలతో పాటు బాలినేని నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్న హామీతో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆ విధంగా వైవీ, బాలినేని ఇద్దరూ ఒకేతాటిపైకి రావడంతో ప్రకాశం రాజకీయం వైసీపీకి పూర్తిగా అనుకూలంగా మారినట్లయింది.