'రోజా ఫోన్లో కెమెరా ఆన్ చేస్తుంటే.. కిడ్నాప్, చంద్రబాబుకు భయమెందుకు'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిసారి తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేస్తోందన్నారు.
జాతీయ మహిళల పార్లమెంటు సదస్సుకు రోజాను ఆహ్వానించి అవమానించడం ఏమిటని నిలదీశారు. మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో తమ పార్టీ అధినేత వైయస్ జగన్ను కూడా ఇలాగే అడ్డుకున్నారన్నారు.
వివాదం: రోజా అరెస్టు, తరలింపు దృశ్యాలు (ఫొటోలు)
సొంత ప్రచారం తప్ప సదస్సు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మహిళా సాధికారతకు తాము కృషి చేస్తున్నామని, వాళ్లకు సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడానికే పార్లమెంటు సదస్సు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం రోజాను ఆహ్వానించి మరీ, పోలీసులతో కిడ్నాప్ చేయించడం ఏమిటన్నారు.
ఇదెక్కడి న్యాయం
ఓ ఎమ్మెల్యేను ఆహ్వానించి, కమిటీలో సభ్యురాలిగా కూడా పెట్టి వచ్చినప్పుడు హాజరయ్యేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా కిడ్నాప్ చేసినట్లు తీసుకెళ్లారని ఇదెక్కడి న్యాయమని బుగ్గన ప్రశ్నించారు.
రోజా ఫోన్లో కెమెరా ఆన్ చేసుకుంటే..
ఫోన్లో కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడుతుంటే, పోలీసులు ఆ ఫోన్ను కూడా లాగేసుకున్నారన్నారు. దానికి విజువల్స్ రూపంలో సాక్ష్యాలు ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. భారత దేశంలో ఉన్నామా లేక మరెక్కడైనా అన్నారు.
భయానికి కారణం
ఇంట్లో పెళ్లికి ఆడవాళ్లను పిలిపించుకొని, అదే పెళ్లికి వాళ్లను రాకుండా మధ్యలో ఆపేస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఇది ఆలాగే ఉందని బుగ్గన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేను అసలు ఎందుకు రానివ్వడం లేదని, మీ భయానికి కారణం ఏమిటో చెప్పాలని నిలదీశారు.
మార్షల్స్ను పెట్టి..
ఇంతకుముందు కూడా రోజాను అసెంబ్లీలో ఏవో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని, కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా, మార్షల్స్ను పెట్టి కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకి కూడా రానివ్వలేదని బుగ్గన మండిపడ్డారు. విశాఖలో సిఐఐ సదస్సు జరుగుతుంటే అదే రోజు జగన్ను సివిల్ పోలీసులు రన్ వే పైన అడ్డుకున్నారన్నారు.