స్పీకర్పై జగన్ తీవ్ర వ్యాఖ్యలు, చంపించిన ఫ్యాక్షనిస్ట్.. టీడీపీ, రోజా వల్లే..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా పైన తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎనిమిది మంది వైసీపీ శాసన సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఈ సమనయంలో వైసీపీ సభ్యులు తమ సభ్యులను సస్పెండ్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
స్పీకర్ వైఖరి నశించాలని నినాదాలు చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అన్నారు. మరోవైపు, బయట సస్పెండైన ఎమ్మెల్యేలు సభ మెట్ల పైన కూర్చొని నిరసన తెలిపారు.
జగన్ మాట్లాడుతూ.. స్పీకర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చివరి అయిదు నిమిషాలు ఏం మాట్లాడానో మీడియాకు చూపించాలని కోరారు. ఆంధ్రజ్యోతి, టీవీ 9.. ఏ ఛానల్ అయినా చూపించాలన్నారు. అధికార పక్షం చెప్పినట్లే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి ధోరణిని తాను ఏ సభలోను చూడలేదన్నారు. గతంలో ఏ స్పీకర్ ఇంత వివక్ష చూపించలేదన్నారు. తాము ఏం మాట్లాడాలో కూడా స్పీకరే చెబితే ఎలా అన్నారు. ఇలాంటి స్పీకర్ను ఇప్పటి వరకు చూడలేదన్నారు. రైతు సమస్యలపై మాట్లాడితే వినే ఓపిక లేదన్నారు. అనంతరం వైసీపీ సభ నుండి వాకౌట్ చేసింది.
జగన్ వ్యాఖ్యల పైన టీడీపీ సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇలాంటి పనికిరాని నాయకులు సభలో ఉండటం దురదృష్టకరమని బుచ్చయ్య చౌదరి అన్నారు. రోజా వంటి నేతల వల్లే సభ గౌరవం పోతోందన్నారు. రోజాను కూడా సంవత్సరం పాటు బహిష్కరించాలన్నారు. స్పీకర్ పైకి దండయాత్ర చేయడం సరికాదన్నారు. స్పీకర్ పైకి దండయాత్ర చేయడం ఆయనను అగౌరవపరచడమే అన్నారు. స్పీకర్ పైన ఆరోపణలు చేయడమేమిటన్నారు.
యరపతినేని మాట్లాడుతూ.. పరిటాల రవీంద్రతో సహా నాలుగు వందల మంది టీడీపీ కార్యకర్తలను చంపించిన వైయస్ జగన్ పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్నారు. సంస్కారహీనంగా వారు మాట్లాడుతున్నారన్నారు. జగన్ ఇంకా ఫ్యాక్షనిస్ట్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ పైన అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇది లోటస్ పాండు కాదని, వైసీపీ ఎల్పీ కాదని, జగన్ అలా మాట్లాడుతున్నారని కాల్వ ధ్వజమెత్తారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదన్నారు.