కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీల ఫైర్- ఏపీకి తీవ్ర అన్యాయం - సాయంత్రం నిర్మలతో భేటీకి నిర్ణయం
ఇవాళ పార్లమెంటులో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్పై వైసీపీ పెదవి విరిచింది. ఏపీకి మేలు చేసే పలు ప్రతిపాదనలు ఇచ్చినా వాటిని కేంద్రం బుట్టదాఖలు చేయడంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఫైర్ అయ్యారు. బడ్జెట్ కేవలం త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల కోసం తయారు చేసినట్లుందని సాయిరెడ్డి ఆరోపించారు. దీని వల్ల ఏపీకి ఎలాంటి మేలు జరగబోదని స్పష్టం చేశారు. పోలవరం, కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు తాము చేసిన అభ్యర్ధనలు పట్టించుకోకపోవడంపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీల ఫైర్
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన సాధారణ బడ్డెట్పై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్ తమను పూర్తిగా నిరాశపరిచిందని వైసీపీ ఎంపీలు తెలిపారు. పోలవరం, ప్రత్యేక హోదా, కొత్త రైల్వే ప్రాజెక్టులు వంటి ఎన్నో ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టినా వాటిని కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై వైసీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేంద్రం ఈసారి రాష్ట్రానికి ప్రకటించిన ఏకైక రోడ్ కారిడార్ ఎందుకూ పనికిరాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
నాలుగు రాష్ట్రాల బడ్జెట్ అన్న విజయసాయిరెడ్డి
కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్టెట్లో ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు చోటు దక్కకపోవడంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ చూస్తుంటే కేవలం నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోందన్నారు. బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళకు మాత్రం బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారని సాయిరెడ్డి తెలిపారు. ఏపీకి మాత్రం కనీస ప్రాజెక్టులు కూడా ఇవ్వలేదన్నారు. విజయవాడ నుంచి ఖరగ్పూర్కు ప్రకటించిన రైల్వే కారిడార్ తమకు ఏమాత్రం పనికిరాదని సాయిరెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్కు నిధుల పంపిణీ మినహా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదన్నారు.
ఏపీ వినతులన్నీ బుట్టదాఖలు
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు చేయాలని కోరామని, పీఎం కిసాన్లో కేంద్రం వాటా పెంచాలని, ఆరోగ్యశ్రీకి పోటీగా ఆయుష్మాన్ భారత్ పథకంలో వ్యాధుల సంఖ్య పెంచాలని కోరామని విజయసాయిరెడ్డి తెలిపారు. అయినా కేంద్రం ఇవేవీ పట్టించుకోలేదన్నారు. ఏపీకి మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రకటించాలని ఆరేళ్లుగా కోరుతున్నా ఫలితం లేదన్నారు. మనకు కావాల్సింది అభివృద్ధి బడ్డెట్ కావాలి కానీ రక్షణాత్మక బడ్జెట్ కాదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాల్ని 100 నుంచి 150కి పెంచాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని విజయసాయి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా నిరాశాజనకమని, దురదృష్టకర పరిణామమని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
నిర్మలతో భేటీ కానున్న వైసీపీ ఎంపీలు
గత బడ్డెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని, ఈసారి కూడా అదే పరిస్ధితి ఉందని వైసీపీ ఎంపీలు తెలిపారు. ఇది సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధమన్నారు. కేవలం ఎన్నికల రాష్ట్రాలకే, కేంద్రం ప్రయోజనాలు ఉన్నచోటే బడ్జెట్ పరిమితం చేయడం సరికాదని వైసీపీ ఎంపీలు తెలిపారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తమ అభ్యంతరాలు తెలియజేస్తామని వైసీపీ ఎంపీలు తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనలో పెండింగ్లో ఉన్న రహదారులను కేటాయించాలని ఆర్ధికమంత్రిని కోరతామని ఎంపీలు వెల్లడించారు.