పవన్ ను సొంత సామాజికవర్గమే నమ్మటం లేదు: చంద్రబాబు ఛాలెంజ్ కు సిద్దం: ఆమంచి ఫైర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ పై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను సొంత సామాజిక వర్గమే నమ్మటం లేదని వ్యాఖ్యానించారు. పార్టీని నడిపే భారం..మోసే ఓపిక పవన్ కు లేవన్నారు. రాష్ట్రం పైనా..రాజకీయాల పైనా పవన్ కు అవగాహన లేదని మండిపడ్డారు.
ఇక, టీడీపీ అధినేత రాజధాని మార్పు అంశంలో రిఫరెండం అంటూ చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానంగా..ఆయన ఛాలెంజ్ కు సిద్దమని చెప్పారు. టీడీపీ నుండి గెలిచిన 3 ఎంపీలు..23 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయిస్తే అందుకు సిద్దమని ప్రకటించారు. రాజధానిగా అమరావతి ప్రకటన రాజ్యాంగవిరుద్దమని..రాజధానిలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ధర్నా చేస్తున్నారంటూ ఆమంచి ఫైర్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎలా కలుస్తారు..
బీజేపీని మొన్నటి వరకు తిట్టి ఇప్పుడు పవన్ వారితో ఎలా కలుస్తారని ఆమంచి ప్రశ్నించారు. పవన్ నిర్ణయం పైన ఆయన అభిమానులతో సహా పార్టీ కార్యకర్తలు బాధ పడుతున్నారని చెప్పుకొచ్చారు. పవన్ తప్పుడు సలహాలతో నడుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు బినామిలతో భూములు కొనుగోలు చేయించారని ఆరోపించారు.
రాజధానిలో టీడీపీ మంత్రులు..ఎంఎల్ ఏలు అనుయాయులు చేసిన దోపిడి,దుర్మార్గాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని..అందులో భాగంగానే..లోకేశ్ ను సైతం ఓడించారని చెప్పుకొచ్చారు. అధికార వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతించారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు అడిగారని.. రాజీనామా చేయిస్తే ప్రజలు తీర్పును అగౌరపరిచినట్లవుతుందన్నారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని మండిపడ్డారు.
చంద్రబాబు ఛాలెంజ్ స్వీకరణకు సిద్దం..
చంద్రబాబు ఛాలెంజ్ ను స్వీకరించడానికి సిధ్దంగా ఉన్నామని ఆమంచి స్పష్టం చేసారు. 23 మంది ఎంఎల్ ఏ లు,ముగ్గురు ఎంపీలతోను,నీ బినామీలు బిజేపికి పంపించినవారితో, చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికలలో నిలుచోబెడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఆర్దికమూలాలు పోతున్నాయని చంద్రబాబు తెగబాధపడిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు జోలె పట్టుకుని మరో డ్రామాకు తెరతీశారని..ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారకుడని ఆరోపించారు.
అమరావతిని ముంపు ప్రాంతంగా శ్రీకృష్ణ,శివరామకృష్ణ కమిటీలన్ని తేల్చిచెప్పాయి.చెన్నై ఐఐటి నిపుణులు కూడా అదే చెప్పారని గుర్తు చేసారు. రాష్ర్టంలో సిబిఐకి అనుమతి రాగానే చంద్రబాబు నరేంద్రమోది కాళ్లు పట్టుకున్నారని ధ్వజ మెత్తారు. గతంలో ప్రధాని టూర్ లో టిడిపి నల్లజెండాలతో నిరసనలు తెలిపిందని గుర్తు చేసారు.