చక్రం తిప్పిన ఆమంచి, సుధీర్ రెడ్డి: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలకు గాలం: వైసీపీకి అనుకూల ఓటు వెనుక.. !
ఒంగోలు: ఏపీ వికేంద్రీకరణ బిల్లు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బిల్లు ఇది. ఈ రెండు పార్టీల బలబలాలకు కేంద్రబిందువైందీ ఈ బిల్లు. 151 మంది సభ్యులు ఉన్న శాసనసభలో ఈ బిల్లును అలవోకగా ఆమోదింపజేసుకున్న వైఎస్ఆర్సీపీకి శాసనమండలిలో చెక్ పెట్టింది తెలుగుదేశం. రూల్ 71ను తెరమీదికి తీసుకొచ్చి పట్టపగలే చుక్కలు చూపిస్తోంది.
వైసీపీని నోరెత్తనీయొద్దు: ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ: అర్ధరాత్రి మంతనాలు: దిశా నిర్దేశం.. !
టీడీపీకి ఎదురు తిరిగే సాహసం..
ఇంత ప్రతిష్ఠాత్మకంగా తెలుగుదేశానికి ఇద్దరు సొంత పార్టీ ఎమ్మెల్సీలు షాక్ ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎవరా ఇద్దరు ఎమ్మెల్సీలు?, రాజకీయంగా తెలుగుదేశానికి జీవన్మరణ అంశంగా మారిన ఈ బిల్లు వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపే సాహసం ఎలా చేశారు? దీని వెనుక ఎవరు కారణం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ సమాధానం లభిస్తోంది.
ఆమంచి కృష్ణ మోహన్ పేరు..
తెలుగుదేశానికి చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగి రెడ్డి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చక్రం తిప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్. గత ఏడాది నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఆయనే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీలకు గాలం వేశారనే వార్తలు ప్రకాశం జిల్లాలో వెలువడుతున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. శివనాగిరెడ్డితో మంతనాలు జరిపారని చెబుతున్నారు.
పోతుల సునీతది ప్రకాశమే..
పోతుల సునీతది ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గమే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో నవోదయం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. ఆ తరువాత ఆమెను టీడీపీ అగ్ర నాయకత్వం మండలికి పంపించింది. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఒకే జిల్లా కావడం వల్ల ఆమంచితో సత్సంబంధాలే ఉన్నాయని చెబుతున్నారు ప్రకాశం జిల్లా ప్రజలు.
శివనాగి రెడ్డి వైసీపీ అనుకూలంగా..
ఇక మరో ఎమ్మెల్సీ శివనాగి రెడ్డి రాయలసీమకు చెందిన నాయకుడు. రూల్ 71కు వ్యతిరేకంగా ఓటు వేయడం వెనుక స్థానిక రాజకీయాలే ప్రభావం చూపాయని చెబుతున్నారు. దీనికితోడు- వైఎస్ఆర్సీపీకి చెందిన రాయలసీమ నాయకులు ఆయనను ప్రభావిం చేసి ఉండొచ్చని అంటున్నారు. టీడీపీ ఏదైనా క్రమశిక్షణాచర్యలకు దిగాల్సిన పరిస్థితే ఎదురైతే.. తమ పార్టీలో రాజకీయ భవిష్యత్తును కల్పిస్తామంటూ వారు హామీ ఇచ్చారని తెలుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ విషయంలో శివనాగిరెడ్డితో మంతనాలు సాగించారని అంటున్నారు.
ఇదీ ఓటింగ్ సరళి..
శాసనమండలిలో రూల్ 71పై నిర్వహించిన ఓటింగ్లో టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాగిరెడ్డి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ ఓటింగులో తీర్మానానికి అనుకూలంగా 27 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. తొమ్మిదిమంది సభ్యులు తటస్థంగా నిలిచారు. వారిలో పీడీఎఫ్ సభ్యులతో పాటు ఒక ఇండిపెండెంట్, బీజేపీ సభ్యులు తటస్థంగా ఉన్నారు. ఈ ఇద్దరిపైనా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే జరిగితే- పార్టీ ఫిరాయిస్తారని చెబుతున్నారు.