"చంద్రబాబు అందానికేనా పార్టీలు మారింది..!! టీడీపీని మూసేసుకోవడానికి సిద్దమా..?"
హైదరాబాద్ : ఏపీలొ ఫిరాయింపు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి-వేడి మాటల యుద్దం కొనసాగుతోంది. వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంగళవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై విరుచుకుపడ్డంతో, నేడు భూమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ప్రతినిథి అంబటి రాంబాబు.
డబ్బుకు అమ్ముడుపోయే రకం కాదని భూమా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. టీడీపీలోకి వెళ్లిన వాళ్లంతా డబ్బులు తీసుకోలేదని కోతలు కోస్తున్నారన్నారు. డబ్బుల కోసం కాకపోతే చంద్రబాబు అందం చూసి పార్టీ మారారా..? లేక ఆయన చేస్తోన్న పాలన చూసి పార్టీని వీడారా..? అంటూ విమర్శించారు అంబటి.
చేసుకున్న పెళ్లి నచ్చకపోతే మరో వివాహం చేసుకునే స్వేచ్చ ఎవరికైనా ఉంటుందని, అయితే విడాకులివ్వకుండా మరో పెళ్లికి సిద్దపడడం చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజీనామాకి సిద్దం అంటూ భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలు 24 గంటల్లోగా రాజీనామా చేసి సైకిల్ గుర్తుపై పోటీకి దిగి గెలవాలని సవాల్ విసిరారు.
ఒకవేళ తాము గెలిస్తే వైసీపీ పార్టీని మూసుకుంటారా..? అని భూమా లాంటి నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. 'మమ్మల్ని పార్టీ మూసుకుంటారా అని ప్రశ్నించే ముందు, ఒకవేళ ఓడిపోతే టీడీపీ పార్టీని మూసేసుకుంటారా..?' అన్న విషయం ముందు తేల్చాలని చెప్పారు. దీనికో ఉదాహరణ కూడా చెబుతూ 'మీ పేరెంటని ఎదుటి వ్యక్తిని ప్రశ్నించినప్పుడు మన పేరు కూడా చెప్పాలి కదా..' అన్నారు.
ఎంతమంది పార్టీని వీడినా వైసీపీకి వచ్చిన నష్టమేమి లేదని.. డబ్బులకు అమ్ముడు పోయిన నేతలు జగన్మొహన్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. అనవసరంగా అవాకులు, చవాకులు పేలవద్దని పార్టీ మారిన ఎమ్మెల్యేలను హెచ్చరించిన అంబటి మాటకు కట్టుబడి పదవులను సైతం పక్కనబెట్టి పోటికి దిగిన కుటంబం వైఎస్ జగన్ ది అని గుర్తు చేశారు.
కమిషన్ల కోసమే టీడీపీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జగన్ గురించి, వైసీపీ పార్టీ గురించి విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. ఒక్కొక్కరిని ఒక్కో రేటు పెట్టి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నాడని, అలాంటోళ్లు పార్టీని వీడినంత మాత్రాన వైసీపీ వన్నె తగ్గదని తెలిపారు.
ఏదో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును ముందేసుకుని చదివినంత మాత్రాన్నే సరిపోదని సిగ్గు, లజ్జ ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు దిగాలని సవాల్ చేశారు. శోభా నాగిరెడ్డి పీఆర్పీ తరుపున గెలిచారని, పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు వైసీపీలో చేరారని, ఆమెతో పాటు పార్టీలోకి వచ్చిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకున్న చరిత్ర వైసీపీకి ఉందన్నారు.
చట్టాలను గౌరవించే బాధ్యత తెలియనోళ్లు మమ్మల్నా విమర్శించేదని మండిపడ్డారు అంబటి. పార్టీ టికెట్ కోసం జగన్ చుట్టూ తిరిగారని, తీరా ఇప్పుడు సిగ్గు లేకుండా పచ్చ కండువాలు భుజానేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. స్క్రిప్టులు చేతికిచ్చి జగన్ పై ఆరోపణలు చేయించినంత మాత్రాన చంద్రబాబు గొప్పోడు కాడని, చట్టాలను గౌరవించేవాళ్లం కాబట్టే ఫిరాయింపులపై ఊరుకుంటూ వస్తున్నామని స్పష్టం చేశారు.
ఇక ముద్రగడ పద్మనాభం గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని బయటకు వెల్లడించకుండా ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపించారు. ఫిబ్రవరి 9న ముద్రగడను కలిసి హామిలిచ్చిన నేతలంతా ఇప్పుడు రాజమండ్రి దరిదాపుల్లో కనిపించడం లేదని, ఇదంతా గమనిస్తుంటే పరిస్థితులు అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయని సంశయం వ్యక్తం చేశారు.