చంద్రబాబు ఆస్తులు ప్రకటించే రోజును...ఏపీ అబద్ధాల దినంగా పెట్టాలి:వైసిపి నేత అంబటి రాంబాబు
విజయవాడ:అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ ఆస్తులు పెరగలేదన్నట్టుగా చెప్పుకోవడానికే చంద్రబాబు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటిస్తున్నట్లు వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.
ప్రకటించే ఆస్తుల వివరాలు ఎవరూ నమ్మే ప్రసక్తి లేదని అంబటి తేల్చేశారు. చంద్రబాబు ఆస్తులు ప్రకటించే రోజును ఏపీ అబద్ధాల దినంగా పెట్టాలని అంబటి రాంబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. గురువారం విజయవాడలోని వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైసిపి ఎందుకు పోటీ చేయడం లేదని చంద్రబాబు, రఘువీరాలు ప్రశ్నించడం అర్దరహితమని...అక్కడ పోటీ చేయడం లేదని గతంలోనే తమ పార్టీ ప్రకటించిందని అంబటి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రులపై ఏడీఆర్ అనే సంస్థ సర్వే చేసి చంద్రబాబును దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా ప్రకటించిందని అంబటి రాంబాబు చెప్పారు. 2017లో ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా లోకేష్ తన అఫిడవిట్లో రూ.330.14కోట్ల విలువైన ఆస్తులు చూపారని..అయితే ఇప్పుడు మాత్రం రూ. 26.39 కోట్లు గానే చూపిస్తున్నారని చెప్పారు. మరి ఇంత తేడా ఎలా వచ్చిందో లోకేష్ చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
ఇక చంద్రబాబు మనువడు దేవాన్ష్ ఆస్తులు గత ఏడాది రూ.11.54 కోట్లు అయితే ఈ ఏడాది రూ. 15.74 కోట్లు ఎలా అయిందో చెప్పాలని అంబటి నిలదీశారు. అలాగే హైదరాబాద్లో చంద్రబాబు వేల కోట్ల రూపాయలతో నిర్మించుకున్న నివాసం విలువ కేవలం రూ. 18 కోట్లుగా మాత్రమే చూపించారని...అయితే ఆ ఇంటిని అందరికి చూపిస్తే చంద్రబాబు బండారం బయటపడిపోతుందన్నారు.
తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే విషయమై అంబటి రాంబాబు వివరణ ఇస్తూ భవిష్యత్తులో ఆ రాష్ట్రంపై తమ పార్టీ దృష్టి పెడుతుందని చెప్పారు. ప్రస్తుతం సిఎం చంద్రబాబు చేతుల్లో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ పైనే తమ పార్టీ దృష్టి పెట్టిందని అన్నారు. ఆ కారణంగానే తెలంగాణలో పోటీ చేయడం లేదన్నారు. చంద్రబాబును ఓడించి ఏపీ ప్రజలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని తేల్చేశారు.
మరోవైపు కాంగ్రెస్ తో టిడిపి పొత్తుపెట్టుకోవడం ద్వారా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీ కాంగ్రెస్కు తాకట్టు పెట్టారని అంబటి దుయ్యబట్టారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి మూల కారణమైన కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. తెలంగాణాలో ముష్టి 13 సీట్ల కోసం చంద్రబాబు దిగజారిపోయారని మండిపడ్డారు. అందువల్లే అక్కడ పోటీ విషయమై తమ పార్టీ నేతలను ప్రశ్నించే హక్కు చంద్రబాబుకు, కాంగ్రెస్కు లేదని అంబటి చెప్పారు.