ఎంత కాలం మోసం చేస్తావ్: 'ప్రధాని మోడీని మించిపోయిన చంద్రబాబు'
అమరావతి: ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అత్యంత విలాసవంతమైన సీఎం చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు.
ఒకవైపు కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి వచ్చేశామని చెబుతూనే, మరొవైపు విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలంటూ ప్రజల్ని ఎంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. ఈ రెండు సంవత్సరాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఓ ఒక్క కంపెనీ అయినా ముందుకొచ్చిందా? చెప్పాలని అన్నారు.
విదేశీ పర్యటనలో ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు మించిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక విమానాల్లో తరలుతున్న సూట్ కేసుల్లో ఏముందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో దోచుకున్న డబ్బుని విదేశాల్లో దాచుకునేందుకే విదేశీ పర్యటనలకు వెళ్తున్నారంటూ మండిపడ్డారు.
చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అంబటి సూచించారు. విదేశాల్లో బిచ్చగాడిలా అడుక్కుంటే పెట్టుబడులు రావని, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు లేకుండా పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విదేశీ మోజులో స్వదేశీ పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఏపీకి ఒక్క రూపాయి లాభం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. హోదా సాధిస్తే పెట్టుబడులు వాటంతటవే వచ్చేస్తాయని అన్నారు. జపాన్ నుంచి అమరావతికి ఒక్క పైసా పెట్టుబడి కూడా రాలేదని ఈ సందర్భంగా అంబటి రాంబాబు గుర్తు చేశారు.