బ్యాంకునకు రూ.148 కోట్ల బకాయి: వైసీపీ నేత, నిర్మాత ఆస్తులు జప్తు: 14న వేలం!
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఆస్తులు వేలానికి రానున్నాయి. కెనరా బ్యాంకునకు ఆయన 148 కోట్ల 90 లక్షల రూపాయలను బకాయి పడ్డారు. దీన్ని వసూలు చేయడానికి కెనరా బ్యాంకు యాజమాన్యం వేలం పాటను నిర్వహించబోతోంది. పొట్లూరి వరప్రసాద్ కు చెందిన పీవీపీ కేపిటల్ లిమిటెడ్ సంస్థను ఈ నెల 14వ తేదీన వేలం వేయనుంది. ఎక్కడ, ఎక్కడ ఎలా ఉన్నది అక్కడా అలా ప్రాతిపదికన వేలం నిర్వహించనున్నట్లు కెనరా బ్యాంకు వెల్లడించింది. దీనికోసం రెండు నెలల కిందటే ఓ నోటీసును జారీచేసింది.
పొట్లూరి వరప్రసాద్ తాను స్థాపించిన పీవీపీ కేపిటల్ సంస్థ పేరు మీద 2003లో కెనరా బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నారు. దీన్ని సకాలంలో తీర్చలేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. రుణం తీసుకునే సమయంలో పొట్లూరి, ఆయన సతీమణి ఝాన్సీ హామీదారులుగా ఉన్నారు. ఝాన్సీ ప్రస్తుతం పీవీపీ గ్రూప్ కే చెందిన పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ ఛైర్మన్ గా ఉన్నారు. ఈ రుణం కోసం ఝాన్సీ హామీదారుగా వ్యవహరించారు. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లంచేలకపోయారు. ఫలితంగా జులై 2వ తేదీ నాటికి ఈ రుణం మొత్తం వడ్డీతో కలిపి 148,90,40,170 రూపాయలకు చేరింది.
Recommended Video
పలుమార్లు నోటీసులను పంపించినప్పటికీ.. పొట్లూరి వరప్రసాద్ స్పందించకపోవడం వల్ల పీవీపీ వెంచర్స్, క్యాపిటల్స్ లిమిటెడ్ ఆస్తులను వేలం వేయాల్సి వచ్చినట్లు కెనరా బ్యాంకు వెల్లడించింది. ఈ సంస్థ పేరు మీద వరప్రసాద్ ఇదివరకు చెన్నై సమీపంలోని పెరంబూరు, పురసవాక్కంలల్లో 2, 62,160 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని వేలం వేయబోతున్నట్లు కెనరా బ్యాంకు వెల్లడించింది. దీనికి 93 కోట్ల రూపాయలు రిజర్వు ధరగా నిర్ధారించింది. ఈ వేలంపాట కోసం కెనరాబ్యాంకు యాజమాన్యం కిందటి నెల 3వ తేదీన ఓ బహిరంగ ప్రకటన జారీ చేసింది. 40 రోజుల తరువాత అంటే.. ఈ నెల 14వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఇది కాస్తా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై ఆయనపై విమర్శలు చేస్తున్నారు. పొట్లూరిని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా ధ్వజమెత్తుతున్నారు. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టినవాళ్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఎద్దేవా చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పొట్లూరి.. వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేశారు. కేశినేని నానిపై స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. వేలంపాటల వ్యవహారంపై పొట్లూరి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.