చంద్రబాబుతో ఆ జాతి నాశనం..భార్య కోడలిని కూడా: లక్ష్మీ పార్వతి
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మరోసారి నిప్పులు చెరిగారు. ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబును నమ్మిన వారెవరూ బాగుపడలేదని, పార్టీ సీనియర్ నాయకుడు బంగి అనంతయ్య ఆత్మహత్యకు యత్నించడం దీనికి నిదర్శనమని అన్నారు.
చంద్రబాబును నమ్ముకుంటే నిలువునా మోసానికి
గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన అల్లుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని చెప్పారు. కమ్మ జాతి పరువును తీస్తున్నారని విమర్శించారు. ఆయన చేస్తోన్న పనులు, ద్వంద్వ నీతి వల్ల కమ్మ జాతి మొత్తం నాశనమౌతోందని అన్నారు. కులాల మధ్య కుంపట్లు రగిలించేలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్ముకుంటే నిలువునా మోసానికి గురవుతారనే విషయాన్ని రాజధాని ప్రాంత రైతులు తెలుసుకోవాలని అని లక్ష్మీపార్వతి సూచించారు.
తన భార్య, కోడలిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం
సింగపూర్ను తలదన్నేలా రాజధానిని నిర్మిస్తానని గొప్పలు చంద్రబాబు.. తన సామాజిక వర్గానికే చెందిన పేద రైతుల పొట్ట కొట్టారని, ఆ భూములను బినామీల పేర్లతో అమ్ముకున్నాడని ఆరోపించారు. తన భార్య, కోడలిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చిన ఘనత చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. అయిదు కాదు.. పదీ కాదు.. ఏకంగా 18 స్టేలను తెచ్చుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయస్థానాల్లో వరుసగా పిటీషన్లను దాఖలు చేస్తున్నారని, ఆ హక్కు ఆయనకు లేదని అన్నారు.
చంద్రబాబుకు అవినీతి, అధికార దాహం, స్వలాభం తప్ప
వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ జీవితాన్ని అందించడానికి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అలాంటి పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధిక శాతం రిజర్వేషన్లను కల్పించడానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేయడం తనకు బాధ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అవినీతి, అధికార దాహం, స్వలాభం తప్ప మరో ఆలోచన లేదని, అందుకే బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారిన మండిపడ్డారు.
Recommended Video
గతంలో వైసీపీ నాయకులు ధర్నాలు చేస్తే..
మూడు రాజధానులను ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయని, దీనివల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకుని రావడానికి కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. గతంలో వైసీపీ నాయకులు ధర్నాలు చేస్తే.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుపడుతున్నారని వాదించిన చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని అంతర్జాతీయ న్యాయస్థానం గడప తొక్కారని నిలదీశారు. చంద్రబాబు రాజకీయ జీవితం చరమాంకంలో ఉందని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు.