టెక్నాలజీ సాయంతో 'తుని' గుట్టు రట్టు, ఇక అరెస్ట్లు: ముద్రగడతో భూమన భేటీ?
విజయవాడ: కాపు గర్జన సమయంలో జరిగిన తుని విధ్వంసంపై సిఐడి పలు కోణాల్లో దర్యాఫ్తు చేస్తోంది. దీని వెనుక కడప జిల్లా నుంచి వచ్చిన కొందరు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు నిఘా విభాగం అప్పట్లో తేల్చింది. మరోవైపు తునిలో అల్లర్లు జరుగుతుండగానే ఘటనా స్థలికి సిఐడి అధికారులు చేరుకున్నారు.
ఈ విధ్వంసం వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారుల్లో ఏ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు, వారి ఫోన్ నెంబర్లకు ఎవరెవరు ఫోన్ చేశారు, సమాచారం పంపారు.. ఇలా అన్ని కోణాల్లో సిఐడి అధికారులు దర్యాఫ్తు ప్రారంభించి ఆరా తీశారు.
ఆ ప్రాంతంలోని సెల్ టవర్ల నుంచి వెళ్లిన ఫోన్లను, వీడియోలు, ఫోటోల్లో గుర్తించిన వారి చిత్రాలను సరిపోల్చుకొని నిందితులను గుర్తిస్తున్నారు. కాపు గర్జన సమయంలో హింస చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రత్నాచల్ ఎక్స్ప్రెస్ బోగీలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు తునిలోని పోలీస్ స్టేషన్లపై విరుచుకుడ్డారు.
కీలక సూత్రధారులను గుర్తించిన పోలీసులు.. ఘటనలో స్వయంగా పాలుపంచుకున్న నిందితులను కూడా గుర్తించారు. నిందితులను గుర్తించేందుకు సిఐడి అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు.
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ వాట్సప్, ఈ-మెయిళ్ల ద్వారా ప్రజల నుంచి పోలీసులు నిందితులకు సంబంధించిన వివరాలు సేకరించారు. సెల్ఫోన్లు, డ్రోన్ కెమెరాల సహాయంతో తుని పరిధిలోని సెల్ టవర్ల ద్వారా కొనసాగిన ఫోన్ సంబాషణలను సేకరించారు. ఈ క్రమంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నిప్పు పెట్టిన వారి ముఖ చిత్రాలు స్పష్టంగా లభించినట్లు సమాచారం.
రత్నాచల్ ఎక్స్ప్రెస్తో పాటు తుని పోలీస్ స్టేషన్లపై దాడులకు దిగిన వారిలో ఇప్పటిదాకా 180 మంది ముఖ చిత్రాలను సేకరించిన పోలీసులు వారిలో 90 మంది వివరాలను కూడా సేకరించారు. వీరిని త్వరలోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ ఘటన వైసిపికి చెందిన కీలక నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఉన్నట్లు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సిఐడి ప్రాథమికంగా గుర్తించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముద్రగడతో భూమన ఓసారి స్వయంగా భేటీ కాగా, ఆ తర్వాత ఫోన్లో టచ్లో ఉన్నట్లుగా కూడా గుర్తించారని తెలుస్తోంది. కాల్ డేటా సహకారంతో నివేదిక తయారు చేశారని తెలుస్తోంది.