క్షీణించిన అస్తిపంజరంలా ఉన్న ఏపీకి.. సిక్స్ ప్యాకా?: చంద్రబాబుపై భూమన
న్ని రంగాల్లోను క్షీణించి ఏపీ అస్తిపంజరంలా తయారైతే.. దానికి సిక్స్ ప్యాక్ తెప్పిస్తానంటూ చంద్రబాబు మాట్లాడటం దారుణమని చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు.. దాన్ని పక్కనబెట్టి గొప్పలు పోతున్నారని విమర్శించారు వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. శుక్రవారం నాడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓవైపు రాష్ట్రంలో తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే.. అగ్రరాజ్యాలతో పోటీ పడుతానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని భూమన అన్నారు. అన్ని రంగాల్లోను క్షీణించి ఏపీ అస్తిపంజరంలా తయారైతే.. దానికి సిక్స్ ప్యాక్ తెప్పిస్తానంటూ చంద్రబాబు మాట్లాడటం దారుణమని చెప్పారు.
ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగానే చూస్తుందంటూ చెప్పుకొచ్చిన వెంకయ్య.. నిన్నటి బడ్జెట్ గురించి మాట్లాడాలన్నారు. ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి అదనంగా ఎందుకు ఇప్పించలేకపోయారని భూమన ప్రశ్నించారు. చంద్రబాబు ఈ విషయంలో వెంకయ్యను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కే విషయంలో చంద్రబాబు-వెంకయ్య ఇద్దరూ అవిభక్త కవలలని భూమన విమర్శించారు. సీఐఐ సదస్సు ద్వారా ఏపీకి వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయనే భ్రమల్లో చంద్రబాబు మునిగిపోతున్నారని భూమన ఎద్దేవా చేశారు.
అదే వైఎస్ హయాంలో కేంద్రం రాష్ట్రం పట్ల అలసత్వం వహిస్తే.. కేంద్రాన్ని నిలదీశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్రం ముందు సాగిలపడటం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.