నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారా, రైతుల గోడు పట్టదా, ఎంతసేపూ స్వప్రయోజనాలేనా?: బొత్స
ఏపీకి ప్రత్యేక హోదా గురించి తెలంగాణ, జాతీయ పార్టీల ఎంపీలు మాట్లాడినా టీడీపీ ఎంపీలు మాత్రం నోరు మెదపలేదని వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
హైదారాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎందుకు నోరు మెదపడం లేదని వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు అధికార పార్టీ ఎంపీలు తమ నోటికి ప్లస్టర్లు వేసుకున్నారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా గురించి తెలంగాణ, జాతీయ పార్టీల ఎంపీలు మాట్లాడినా టీడీపీ ఎంపీలు మాత్రం నోరు మెదపలేదని, చివరికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం ప్రకటించినా వారు మిన్నకుండిపోయారని బొత్స దుయ్యబట్టారు.
ఏం మాట్లాడితే ఏం కొంప మునుగుతుందో అని టీడీపీ ఎంపీలు భయపడ్డారని, తాము మాట్లాడితే కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతో నోళ్లు మూసుకున్నారని ఆయన ఆరోపించారు.
గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. రైతులను పట్టించుకోవడంలో టీడీపీ సర్కారు విఫలమైందన్నారు.
అన్నదాతల కష్టాల గురించి మూడు నాలుగు నెలలుగా రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు గొంతెత్తుతున్నా సర్కారు ఏమాత్రం స్పందించలేదని, మిరప రైతుల ఇక్కట్లు ప్రభుత్వానికి పట్టడం లేదని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.
రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారంటూ ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలను టీడీపీ నాయకులు తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని, రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ఆరోపించారు.