చంద్రబాబుకు తోట నరసింహం ఝలక్!: వైసీపీ నేత బొత్సతో అరగంట భేటీ
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాకినాడ పార్లమెంటు సభ్యులు, టీడీపీ నేత తోట నరసింహంతో సోమవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.
తోట త్రిమూర్తులు స్వగ్రామం కిర్లంపూడి మండలంలోని వీరవరంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. దాదాపు అర్దగంట పాటు చర్చలు జరిపారని తెలుస్తోంది. భేటీ అనంతరం బొత్స అక్కడి నుంచి వెళ్లిపోయారు. తోటను బొత్స కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
అనారోగ్యం దృష్ట్యా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని, తన సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని తోట నరసింహం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇటీవల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిశారు. ఆ స్థానంలో ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తోట నరసింహంతో బొత్స భేటీ అయ్యారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీకి వరుస దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా తాను ఎన్నికల బరిలోకి దిగడం లేదని కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇదివరకే చెప్పారు. కానీ తన భార్య వాణికి మాత్రం టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నేతను కలిశారు. ఆయన వైసీపీలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది.
అయితే, తోట నర్సింహం టీడీపీని వీడి వైసీపీలో చేరినా జగ్గంపేట టిక్కెట్ వస్తుందనే ఆశ లేదని అంటున్నారు. అక్కడి నుంచి జ్యోతుల చంటిబాబు ఇప్పటికే వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. జగన్ ఆయనకు టిక్కెట్ కూడా ఖరారు చేశారని చెబుతున్నారు.