సీఎం జగన్ సమక్షంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చేదు అనుభవం.. వీడియో వైరల్
అధికార వైసీపీలో వివిధ జిల్లాల్లో వర్గపోరు తారా స్థాయికి చేరినవేళ.. పార్టీకి చెందిన ప్రముఖ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సీఎం జగన్ సమక్షంలో చేదు అనుభవం ఎదురైంది. సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఊంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ కర్నూలు జిల్లా నేతకు సంబంధించిన వీడియో వైరలైంది. సొంత జిల్లాలోనే తమ నేతకు అవమానం జరగడంపై సిద్ధార్థ అనుచరులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం కర్నూలులో పర్యటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.1,129 కోట్ల ఖర్చుతో నిర్మించబోయే హెల్త్ సెంటర్ల నమూనా బిల్డింగ్ కు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. దాంతోపాటు మూడో దశ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. కేబినెట్ మంత్రులతోపాటు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతోపాటు బైరెడ్డి సిద్ధార్థ్ కూడా సీఎం మీటింగ్ కు హాజరయ్యారు. అయితే చివర్లో మాత్రం ఆయన అవమానాన్ని చవిచూడాల్సివచ్చింది.
సభా వేదికపై బైరెడ్డి కూడా ఉన్నప్పటికీ.. సీఎం జగన్ తో వ్యక్తిగతంగా మాట్లాడటానికి సెక్యూరిటీ సిబ్బంది నిరాకరించారు. సీఎం కారు ఎక్కేముందు బైరెడ్డి ప్రయత్నించారు. సీఎం కాన్వాయ్ ముందు నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ను సెక్యూరిటీ సిబ్బంది గట్టిగా తోసేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన బైరెడ్డి.. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతలోనే వైసీపీ నేతలొచ్చి ఇద్దరినీ సముదాయించడంతో వివాదం సర్దుమణిగింది. అయితే తమ నేతను సీఎం అవమానించారంటూ బైరెడ్డి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు, కామెంట్లు వైరలయ్యాయి.