చిల్లర రాజకీయాలు చేయను, అలా అనుకుంటే తిక్క అని పిలువొచ్చు: వైసీపీ నేత
హిందూపురం: తాను వ్యక్తిత్వాన్ని చంపుకొని చిల్లర రాజకీయాలు చేయలేదని అందుకే ఓడిపోయానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నేత నవీన్ నిశ్చల్ అన్నారు. అలాంటి గెలుపు తనకు అవసరం లేదని చెప్పారు.
చదవండి: దూకుడు తగ్గించుకుంటూ వెళ్తున్నా, అలా అనుకోవద్దు: బాలకృష్ణపై పోటీ చేసిన వైసీపీ నేత
ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలవలేకపోవచ్చునని, కానీ ఈ రోజు హిందూపురంలో ఎక్కడ చూసినా తాను నాటిన చెట్లే ఉంటాయని చెప్పారు. ఇలాంటి పని చేసేందుకు అధికారంలో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
చదవండి: పవన్ కళ్యాణ్ సిగ్గుపడలేదు, నాకు కనువిప్పు కలిగింది, థ్రిల్ అయ్యా: వర్మ
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
తన కులానికి చెందిన వాళ్లే ఓట్లు వేస్తే సరిపోదని, ప్రజలందరి మన్నన పొందాలని నవీన్ నిశ్చల్ అన్నారు. కుల సంఘాలను అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అబద్దాలు చెప్పవలసిన పరిస్థితి వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
అందుకే ఓడిపోయా
2004లో తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశానని, 2009లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని నిశ్చల్ చెప్పారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేశానని, మూడుసార్లు ఓడిపోయానని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేయకపోవడం వల్లే ఓడిపోయానని వ్యాఖ్యానించారు.
నాకు ఒక్కసారి అవకాశమిస్తే
దేవుడు తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే కనుక, తాను గెలిస్తే మరో ఇరవై ఏళ్ల పాటు ఇంకెవరికి అవకాశం ఇవ్వనని, అలాంటి స్థాయిలో అభివృద్ధి చేస్తానని నవీన్ నిశ్చల్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలను అడ్డుపెట్టుకొని తాను డబ్బు సంపాదించుకునే రకం కాదని చెప్పారు.
అలా అయితే తిక్క అని పిలుచుకోవచ్చు
రాజకీయాల్లో తాను పూర్తి సమయం పని చేస్తానని, తాను చనిపోయిన తర్వాత కూడా నవీన్ ఉన్నాడని, మాట కోసం నిలబడేవాడని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. నేను ముక్కుసూటి మనిషిని అని చెప్పారు. అలా మాట్లాడటం తిక్క అంటే అలాగే పిలుచుకోవచ్చునని చెప్పారు. మనసులో ఉన్నదే పైకి చెబుతానని, లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ వేషాలు వేయలేనని చెప్పారు.