చంద్రబాబుపై ముప్పేట దాడి: ప్రత్యేకహోదా ఉచ్చులో చిక్కారా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న టీడీపీ నలువైపుల నుండి విమర్శలు ఎదుర్కొంటోంది.
రాష్ట్రంలోని బీజేపీ నేతలు సైతం కాస్తంత ఒత్తిడిలో కనిపిస్తున్నారు. ప్రజలకు ముఖాన్ని చాటేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఇదే అదనుగా టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం నుంచి వైదొలగాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
గురువారం ఆయన హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు. మొదటి నుంచి కూడా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టంగా చెప్తోందని అన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా ప్రత్యేక ఉద్యమాన్ని శ్రీకారం చూడదామని, అందరం కలిసి పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పోరాటం చేసినా తాము మద్దతిస్తామని చెప్పారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ఆకాంక్షను కేంద్రానికి తెలియజేద్దామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కాకమ్మ కథలు చెప్పడం మానాలని, తెగించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
చంద్రబాబుని మోడీని నిలదీయాలి: మాజీ మంత్రి శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోడీని నిలదీయాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గురువారం అనంతపురం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద శైలజానాథ్ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెంటనే రాజీనామా చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.