'పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడకు వెళ్ళారు'
హైదరాబాద్: నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై మాజీ ఎమ్యెల్యే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 'పోరుబాట' పేరుతో రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటలో పాల్గొన్న ద్వారంపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడకు వెళ్ళారని ప్రశ్నించారు.
చంద్రబాబు తప్పుడు హామీలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఏసీ గదులకు పరిమతమైన పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా విజ్ఞతతో చంద్రబాబు హామీల అమలకు కృషి చేయాలని సూచించారు.
చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలను ప్రశ్నించకుంటే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేసినట్లు అవుతుందని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విరుచుకుపడ్డారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు మోసం: శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా రైతు రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు.
ఐదు సంవత్సరాలు పూర్తైనా రుణమాఫీ సాధ్యం కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బాబు అబద్ధపు మాటలతో కమిటీలు, జీవోల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.