ఆ ఇష్యూలోకి జగన్ సతీమణి భారతిని లాగిన చింతమనేని, 'ఆ వ్యాఖ్యలు బాధ కలిగించాయి'
ఏలూరు: దళితులపై అసభ్యకరంగా మాట్లాడిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తానేటి వనిత సోమవారం డిమాండ్ చేశారు. దళితులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలు చాలా బాధను కలిగించాయని చెప్పారు. దళితులపై దేహి వంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
చింతమనేని నోటిని అదుపులో పెట్టుకో
చింతమనేని ప్రభాకర్ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తానేటి వనిత హెచ్చరించారు. అధికారులపై కూడా చింతమనేని దాడులకు దిగుతున్నారని చెప్పారు. చింతమనేని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని చెప్పారు. కొవ్వూరు పోలీసు స్టేషన్లో చింతమనేని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకోలేదన్నారు.
చింతమనేని వ్యాఖ్యలు మార్ఫింగ్ చేశారని చెప్పడం విడ్డూరం
చింతమనేని వ్యాఖ్యలు మార్ఫింగ్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చెప్పడం విడ్డూరమని తానేటి వనిత అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులను కేవలం ఓట్లుగా మాత్రమే చూస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు దళితులను హీనంగా చూస్తున్నారని చెప్పారు. దళితుల ఇంట్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు కోరితే సరిపోతుందా అన్నారు. ఆ వీడియోలోని వ్యాఖ్యలు బాధ కలిగించాయని వనిత అన్నారు.
జగన్ సతీమణి భారతిని లాగిన చింతమనేని
కాగా, నీకు సత్తా ఉంటే దెందులూరులో పోటీ చేసి గెలిచి శభాష్ అనిపించుకోవాలని జగన్కు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సవాల్ అంతకుముందు విసిరారు. రాజకీయంగా ఎదుర్కొలేక దళిత వ్యతిరేకిగా తనను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, తాను మాట్లాడిన మాటలను కుట్రపూరితంగా మార్ఫింగ్ చేశారని, 30 సెకన్లుగా ఉన్న వీడియోను చూసి నన్ను దళితులు అపార్థం చేసుకుని ఉంటే దళిత సంఘాలు, పౌరులకు క్షమాపణ చెబుతున్నానని, వాస్తవం తెలుసుకునేందుకు తాను మాట్లాడిన 2.30 నిమిషాల పూర్తి వీడియోను చూడాలని కోరుతున్నానని, తాను దళితులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని, తానేంటో దెందులూరుకు వచ్చి దళితులను అడిగితే చెబుతారని, తనపై అసత్య ప్రచారాన్ని చేస్తున్న సాక్షి పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని, తప్పుడు వార్తలు ప్రచురించినందుకు ఆ పత్రిక ఎండీ భారతి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.