వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీ ఫారం అందుకున్న జంగా కృష్ణమూర్తి
అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీని చేస్తానంటూ ఇచ్చిన హామీ మేరకు ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు జంగా కృష్ణమూర్తి గురువారం బీఫారం అందుకున్నారు. వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ఆయనకు బీఫారం అందజేశారు. ఈ నెల 25వ తేదీన జంగా కృష్ణమూర్తి అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పార్టీ పెట్టిన తొలి రోజుల నుంచీ జంగా కృష్ణమూర్తి తనకు అండగా ఉంటూ వచ్చారని, ఆయన చేసిన సేవలను గుర్తుంచుకుని, ఎమ్మెల్సీని చేస్తానని వైఎస్ జగన్.. ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీ నాయకులకు తమ పార్టీలో అన్ని విధాలుగా ప్రాధాన్యత ఉంటుందని జగన్ అప్పట్లో ప్రకటించారు. దీనికి అనుగుణంగా జంగా కృష్ణమూర్తి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. శాసన సభ్యుల కోటాలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో జంగా కృష్ణమూర్తి గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస రావు చేతిలో ఏడు వేల పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం ఆయనను పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించారు వైఎస్ జగన్.
రాష్ట్రంలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ పదవీ కాల వ్యవధి వచ్చనెల 29వ తేదీ నాటికి ముగియనుంది. వారిద్దరితో పాటు అంగూరి లక్ష్మీ శివకుమారి, పామిడి శమంతక మణి, ఆదిరెడ్డి అప్పారావుల పదవీ కాల వ్యవధి కూడా పూర్తవుతుంది.
ఆదిరెడ్డి అప్పారావు వైఎస్ఆర్ సీపీ తరఫున శాసన మండలికి ఎన్నికైనప్పటికీ.. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రులు ఇద్దరికీ మరోసారి అవకాశం దక్కుతుంది. వారిద్దరి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీడీపీకే చెందిన శమంతక మణి, ఆదిరెడ్డి అప్పారావుల స్థానంలో ఎవర్ని ఎంపిక చేస్తారనేది ఇంకా తెలియరాలేదు.
ఆ ఖాళీలను భర్తీ చేయడానికి గురువరం నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 28 చివరి తేదీ. వచ్చేనెల 1వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 5. కాగా, 12వ తేదీన పోలింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు 15వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.