జగన్కు భారీగా డొనేషన్ ఇచ్చా! ఎవరి మాటా వినను: కన్నబాబు సంచలనం
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాను పెద్ద ఎత్తున డొనేషన్ ఇచ్చానని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు అన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎవరూ ఇవ్వనంత డొనేషన్ తాను ఇచ్చానని తెలిపారు.
తాను పార్టీ కోసం పెద్ద మొత్తం డబ్బు ఇచ్చానని, తాను ఎవరి మాటను లెక్కచేయనని చెప్పారు. ఇక్కడ ఎవరు ఎటువంటి వారో తనకు తెలుసని, ఎవరు ఎన్ని చెప్పినా తన శైలి మాత్రం మారదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో తనకు తెలుసని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి.
వైసీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ అధినేత జగన్ పాదయాత్రపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యలమంచిలి నేతలు, కార్యకర్తలతో మునగపాకలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్... కన్నబాబుపై పరోక్షంగా ఆరోపణలు, విమర్శలు చేశారు. దీంతో కన్నబాబురాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన తర్వాత మైక్ తీసుకొని.. జగన్కు తాను బోలెడు విరాళం ఇచ్చానని, తనను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. నా స్టయిల్ మారదని చెప్పారు. ఎలా గెలవాలో తెలుసు అన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇరు వర్గాల మద్దతుదారులు నినాదాలు చేశారు.