రూ.45 కోట్లతో హైదరాబాద్లో పవన్ కొత్తిల్లు, చిరంజీవి మాత్రమే వెళ్లారు, అమరావతిలో రూ.కోట్ల భూమి'
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని ఆదివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ రూ.45 కోట్లతో ఇల్లు కట్టించారనే ప్రచారం సాగుతోందని, ఆ ఇంటికి కేవలం ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాత్రమే వెళ్లారని చెబుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. పవన్ గారూ.. మీరు గృహ ప్రవేశాలు చేస్తున్నారు, కానీ మీరు ఎక్కడుంటారో మీకైనా తెలుసా? అని ప్రశ్నించారు.
ఓటుకు నోటు నుంచి దేని పైనా మాట్లాడలేదు
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఏపీలో కలకలం రేపిన కాల్ మనీ కేసులపై చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా నిలదీయలేదని పేర్ని నాని అన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే జనసేనాని ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీసారు.
ప్రజారాజ్యం ఓడిపోయాక పారిపోయాడు, పారిపోతూనే ఉన్నాడు
2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పారిపోయారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచి ఆయన పారిపోతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాత్రమే పవన్ రంపచోడవరం వెళ్లారని, కానీ తమ పార్టీ అధినేత వైయస్ జగన్ మాత్రం పలుమార్లు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలపై పోరాటం చేశారని చెప్పారు.
నీకంటే ముందే జగన్ పోరాటం
బాక్సైట్ తవ్వకాల పైన జగన్ పోరాటం చేశారని పేర్ని నాని అన్నారు. పవన్ మాత్రం ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో లక్షమందితో సభ నిర్వహించి బాక్సైట్ జోలికి వస్తే ఊరుకోమని రామ్మోహన్ రెడ్డి ఎప్పుడో హెచ్చరించారన్నారు.
చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకే పవన్ ప్రయత్నం
చంద్రబాబు నాయుడును మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. అమరావతిలో కోట్లు విలువ చేసే భూమిని లింగమనేని రమేష్ కేవలం రూ.25 లక్షలకే పవన్ కళ్యాణ్కు ఇచ్చారని ఆరోపించారు. పవన్ చెల్లించిన దాని కంటే రూ.5 లక్షలు ఎక్కువగా ఇస్తామని, దానిని పవన్ తమకు ఇస్తారా అని నిలదీశారు.
చంద్రబాబు రాజకీయ జీవితం దానికే సరిపోయింది
చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయం ప్రజలను మోసం చేయడానికే సరిపోయిందని పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు చొక్కాలు మార్చినంత సులభంగా పార్టీలు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం.. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన దరిచేరని పార్టీ లేదన్నారు.