రైతుల సొమ్ముతో విలాసాలు: చంద్రబాబుపై పార్ధసారథి నిప్పులు
హైదరాబాద్: చేనేత రుణమాఫీ అంటూ మరో చేతగాని రుణమాఫీకి చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధమైందని వైసీపీ నేత కె. పార్ధసారథి విమర్శించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీ మరో వర్గానికి ఇప్పుడు మొండి చేయి చూపుతోందని ఆరోపించారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారంటూ ఆ పార్టీపై పార్థసారథి మండిపడ్డారు. మా ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిందని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.
చేనేత కార్మికులకు ఇంకా 365 కోట్లు బ్యాంకు రుణాలు ఉన్నాయని కోటయ్య కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేవలం రూ. 110 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు.
రుణమాఫీ చెయ్యాల్సిన సొమ్మును చంద్రబాబు విలాసాలకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడమే మీ ఉద్దేశ్యమా అంటూ నిలదీశారు.
ఎంతసేపు ప్రజలకు ఎలా వాతలు పెట్టాలా అన్న ఆలోచన అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రుణమాఫీ అంటూ రైతులు, డ్వాక్రా మహిళలను మోసగించారని ఆరోపించారు. ఇప్పుడు చేనేత కార్మికుల వంతు వచ్చిందని, వారిని కూడా మోసగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే చేనేత కార్మికుల రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ను విమర్శించే నైతిక హక్కు ఆనం సోదరులకు లేదన్నారు.
అమృత్ పథకం అమలుకు నిధులు విడుదల
అమృత్ పథకం అమలుకు తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 13 రాష్ట్రాలకు గాను రూ.1,062.27 కోట్లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు రూ.60.08 కోట్లు, తెలంగాణకు రూ. 40.85కోట్ల నిధులు మంజూరు చేసింది.