రూటు మార్చిన పీవీపీ? మోడీకి జై కొట్టిన వైసీపీ నేత: నెహ్రూలా మోసపోలేదంటూ: మరో రఘురామలా?
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) రూటు మార్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని కేసులు, అరెస్టును ఎదుర్కొంటోన్న ఆయన హఠాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జై కొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చర్చనీయాంశమైంది. వైసీపీకి చెందిన నర్సాపురం లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు తరహాలో పీవీపీ కూడా పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ ప్రస్తుతం అరెస్టును ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేశారని, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పీవీపీపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. తన ఇంటికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులపై తన పెంపుడు కుక్కులను వదిలారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య పీవీపీ తన రూటు మార్చినట్టే కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జై కొడుతూ ఆయన తాజాగా ఓ ట్వీట్ సంధించారు. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ నుంచి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనిక బలగాలు వెనక్కి వెళ్లిపోవడాన్ని పీవీపీ..ప్రస్తావించారు. సరిహద్దు వివాదంలో ప్రధానమంత్రి అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని ప్రశంసించారు. చైనా వెనక్కి తగ్గేలా ఒత్తిడిని తీసుకొచ్చారని చెప్పారు.
శాంతి సందేశం పంపిస్తున్న చైనా !
— PVP (@PrasadVPotluri) July 7, 2020
హిందీ, చీని భాయి భాయి అని నెహ్రు గారిలా మోసపోకుండా డిజిటల్ స్ట్రైక్స్ మరియు దౌత్యం ద్వారా వెనక్కి నెట్టిన @narendramodi గారికి దేశమంతా జేజేలు 👍👍
Recommended Video
దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూలా చైనా చేతిలో నరేంద్ర మోడీ మోసపోలేదని పేర్కొన్నారు. హిందీ చీనీ భాయి భాయి అంటూ నెహ్రూలా మోసపోలేదని అన్నారు. సరిహద్దుల నుంచి తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకున్న చైనా.. భారత్కు శాంతి సందేశాన్ని పంపిస్తోందని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ తీసుకున్న సాహస నిర్ణయాల వల్లే చైనా వెనక్కి తగ్గిందని ప్రశంసించారు. డిజిటల్ స్ట్రైక్స్, చర్చలు, దౌత్యపరమైన చర్యల ద్వారా చైనాను వెనక్కి నెట్టిన ప్రధానికి దేశ ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారని చెప్పారు. ఈ ఒత్తిళ్ల ఫలితంగానే చైనా తన బలగాలను ఉపసంహరించుకుందని పరోక్షంగా పేర్కొన్నారు.