అమరరాజాను పొమ్మంది మేమే- ప్రాణాంతకమన్న హైకోర్టు- సజ్జల కామెంట్స్
టీడీపీ నేత గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్ధను రాష్ట్రం బయటికి వెళ్లిపొమ్మంది తామేనని ఇవాళ వైసీపీ సర్కార్ ప్రకటించింది. అమరరాజా బ్యాటరీస్ సంస్ధ నుంచి వెలువడే కాలుష్యం వల్ల జనం ప్రాణాలు పోతున్నాయని పీసీబీతో పాటు హైకోర్టు కూడా నిర్ధారించాయని తెలిపింది. దీంతో అమరరాజా బ్యాటరీస్ సంస్ధ రాష్ట్రం విడిచి వెళ్లిపోవడం లేదని, తామే బయటికి పంపుతున్నట్లు అంగీకరించింది.
ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా పరిశ్రమలు నడుపుకోవాలని ప్రభుత్వం చెబుతోందని, అమర రాజా సంస్ధకు కూడా అలాగే సమయం ఇచ్చామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో విఫలమైతే సంస్ధ కంటే మనుషుల ప్రాణాలకే విలువ ఇవ్వాలని హైకోర్టే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. తమకు అమర రాజాపై కోపం లేదని, ప్రజల ప్రాణాలు హరించే పరిస్ధితి వచ్చినందుకే సంస్ధను రాష్ట్రం బయటికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
అమరరాజా బ్యాటరీస్ సంస్ధలో 55 మందికి పరీక్షలు చేస్తే 41 మంది శరీరాల్లో సీసం ఉన్నట్లు తేలిందని, అక్కడ అమరరాజాయే కాదు వైవీ సుబ్బారెడ్డి సంస్ధ ఉన్నా ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందని సజ్దల రామకృష్ణారెడ్డి తెలిపారు. గల్లా రామచంద్రనాయుడు, గల్లా జయదేవ్ టీడీపీ వారని, అమరరాజా సంస్ధలో అక్రమాలు, తప్పులున్నా ప్రభుత్వం ప్రశ్నించకూడదా అని సజ్జల నిలదీశారు. కాలుష్యంపై పీసీబీ, హైకోర్టు నిర్ధారించినందువల్లే తాము చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.