నిమ్మగడ్డ గబ్బర్సింగ్ అనుకుంటాడు -నాడు జేడీ లక్ష్మీనారాయణ ఇలాగే -ఫ్యాక్షనిస్టులా ఎస్ఈసీ: సజ్జల ఫైర్
ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొద్ది రోజులుగా చోటుచేసుకుంటోన్న పరిణామాలపై ప్రభుత్వ సలహాదారుడు, అధికార వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తుగా అభివర్ణిస్తూ, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తోన్న రాక్షసులుగా వారిని తిట్టిపోశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సజ్జల ఏమన్నారో ఆయన మాటల్లోనే..
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన హైకోర్టు -'హౌజ్ మోషన్' అత్యవసరం కాదన్న బెంచ్ -సుప్రీంకోర్టుకు ఎస్ఈసీ?
దుష్ట శక్తులు.. కుట్ర కోణాలు..
''సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా ముందుకు పోతోందన్న దుగ్ధతో దుష్ట శక్తులన్నీ ఏకమై ప్రజా సంక్షేమానికి అడ్డు తగులుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సరిగ్గా సంక్షేమ పథకాలు ప్రారంభించే సమయంలోనే దేవాలయాలపై జరుగుతున్నదాడులు జరుగుతుండటం వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉంది. సున్నితమైన అంశాలను రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. వీటి వెనుక...
కుట్రల సూత్రధారి చంద్రబాబే..
సీఎం జగన్ పై బురద చల్లే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబే ఈ కుట్రలకు నాయకత్వం వహిస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుంటే.. చంద్రబాబు అండ్ కో రాక్షసుల్లా అడ్డుతగులుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా 31 లక్షల అడపడుచుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం జరుగుతంటే, వాటిని చీకటితో చెరిపేసే ఉద్దేశంలో చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నారు. మతపరమైన అంశాలను రెచ్చగొడుతున్నారు. రాజకీయానికి, మతానికి ఎలాంటి సంబంధం ఉండరాదన్నది వైసీపీ సిద్ధాంతం. ఎట్టి పరిస్థితుల్లో భక్తిని, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అయినాసరే.. వినకుండా దేవుళ్ళతో ఆటలాడుకోవాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తాం. విగ్రహాలు ధ్వంసం వెనుక దాగివున్న కుట్రను త్వరలో ఛేదిస్తాం. ఇక..
నిమ్మగడ్డ గబ్బర్ సింగ్ అనుకుంటున్నాడు..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత అమ్మఒడి పథకానికి అడ్డు తగిలేందుకు చంద్రబాబు తన అనుంగ అనుచరుడైన నిమ్మగడ్డ రమేశ్ ను మరోమారు తెరమీదకు తెచ్చాడు. కానీ ఈసారి వాళ్ల పాచికలు పారలేదు. ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన నిమ్మగడ్డకు కోర్టు అక్షింతలు వేసింది. నిమ్మగడ్డ రమేశ్ తనను తాను గబ్బర్ సింగ్ అనుకుంటున్నాడు. ఎస్ఈసీ పదవిలో ఉండి ఆయన పచ్చి ఫ్యాక్షనిస్టులా, నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో..
నాడు సీబీఐ జేడీ కూడా ఇలానే..
ఎన్నికల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, ఉద్యోగులపై ఇష్టారీతిగా చర్యలకు ఆదేశిస్తోన్న నిమ్మగడ్డ గబ్బర్ సింగ్ అనుకుంటున్నాడు. గతంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇలానే చేశాడు. ఫ్యాక్షనిస్ట్లా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డకు ఇప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు గుర్తుకొచ్చింది? ఆయన ఉద్యోగులను సరెండర్ చేస్తే.. మేం(ప్రభుత్వం) మళ్లీ వేరే వారిని పంపుతాం. ఎవరైనా సరే చట్టం ప్రకారమే పనిచేయాల్సి ఉంటుంది. నిమ్మగడ్డకు అహంకారం ఎక్కువై నియంతలా వ్యవహరిస్తున్నాడు. రాజ్యాంగ బాధ్యత ఉన్న వ్యక్తిగా నిమ్మగడ్డ ఏనాడూ వ్యవహరించలేదు. నిమ్మగడ్డ ప్రతి అడుగు టీడీపీ చీఫ్ చంద్రబాబు డైరెక్షన్ లోనే జరుగుతోంది'' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ట్రంప్ దివాళా: పుట్టెడు అప్పులు -వేలానికి లగ్జరీ కారు -కొనేందుకు సిద్ధమైన కేరళ జువెలర్ బాబీ