చంద్రబాబుకు కౌంటర్ పడిందిగా: పలకడానికే ఇబ్బంది పడే వ్యాఖ్యలు ఆయన నోట పదేపదే: సజ్జల
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావ్ అరెస్టు వ్యవహారంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుదాడి ఆరంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్పై ఈ ఉదయం ఆయన చేసిన ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. చంద్రబాబు శాడిజమేంటో అర్థం కావట్లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. మతాన్ని రెచ్చగొట్టి, చలి కాచుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
Recommended Video
ఉన్మాది సర్కార్ను నడిపించేది వారిద్దరే: జగన్ క్రైస్తవుడు..అందుకే మత మార్పిళ్లు: చంద్రబాబు
శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల నరికివేత అంటూ..
రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలను నరికి వేశారంటూ చంద్రబాబు పదే పదే చేసిన వ్యాఖ్యల పట్ల సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీరాముడి విగ్రహం తల నరికివేత అనే పదాన్ని పలకడానికి ఎవ్వరైనా గానీ ఇబ్బంది పడతారని, అలాంటిది చంద్రబాబు పలుమార్లు దాన్నే ఉచ్ఛరించడం వెనుక అర్థమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు శాడిజానికి, మానసిక స్థితికి ఇది అద్దం పడుతోందని చెప్పారు. దేవాలయాలు, విగ్రహాలపై దాడులను చంద్రబాబే వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారంటూ వార్తలు వస్తోన్న వేళ.. చంద్రబాబు బరి తెగించి మాట్లాడుతున్నారని అన్నారు.
టీడీపీ కార్యకర్తల ప్రమేయం ఉండటంతో..
విగ్రహాల విధ్వంసం వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉందనడానికి సీసీటీవీ ఫుటేజీలు వెలుగులోకి రావడంతో ఆ పార్టీ నేతల స్వరం మారిందని సజ్జల చెప్పారు. కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించపజేయడానికే పాత విగ్రహాన్ని తమ పార్టీ నేతలు తరలించారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఎవ్వరైనా రాజకీయ నేతలు విగ్రహాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తారా? అని ప్రశ్నించారు. చేసిన తప్పులు ఒక్కటొక్కటిగా బయటికి వస్తుండటంతో చంద్రబాబు సహా టీడీపీ నేతలందరి గుట్టు రట్టయిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు.
తనను తాను తిట్టుకున్నట్టుగా
చంద్రబాబు ఈ ఉదయం ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలన్నీ తననను తాను తిట్టుకుంటున్నట్లుగా తనకు అనిపించిందని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తమ పార్టీ నేతలను నిర్బంధించిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోయినట్టు ఉందన చెప్పారు.. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలీసులు ఎక్కడ నిర్బంధించారో తెలియకుండా వెదుక్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై తప్పుడు కేసులను బనాయించిన సందర్భాలు చంద్రబాబు హయాంలో ఎన్నో ఉన్నాయని అన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఎందుకు నిర్వహించలేదు..
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సజ్జల స్పందించారు. 2018లోనే నిర్వహించాల్సిన పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారో ఇప్పుడు చంద్రబాబు గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గానీ చెప్పగలరా? అని ప్రశ్నించారు. గత ఏడాది ఫిబ్రవరిలో కరోనా వైరస్ కేసులు నామమాత్రంగా ఉన్నప్పుడు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనడానికైనా సరైనా వివరణ వారిద్దరూ ఇవ్వగలరా అని నిలదీశారు. తాజాగా హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయదలిచిందని పేర్కొన్నారు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా విజయం తమదే అవుతుందని అన్నారు.