టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా: చంద్రబాబు రెఫరెండం సవాల్కు సజ్జల ఘాటు కౌంటర్
అమరావతి: అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం కేంద్ర బిందువుగా రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జనభేరిలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలంటూ జనభేరి సభలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రెఫరెండం నిర్వహించడంలో భాగంగా.. తొలుత సొంత పార్టీకి చెందిన శాసన సభ్యులతో చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదివరకు తమ ప్రభుత్వం ప్రకటించిన విధంగా అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగించాలని, అలా కుదరకపోతే మూడు రాజధానుల అంశంపై రెఫరెండం పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే సిద్ధపడాలని అన్నారు. ఈ రెఫరెండం సందర్భంగా ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ విసిరారు.
దీనిపై వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. తొలుత సొంత పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, రెఫరెండం నిర్వహించడానికి చంద్రబాబు పిలుపునివ్వాలని సూచించారు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనుసరించిన రాజకీయాలకు అనుగుణంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోగలరా? అని ప్రతి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన సమయంలో వైఎస్ జగన్.. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు.
Recommended Video
అదే తరహాలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్.. ఎంపీ, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఆ తరువాత చట్టసభలకు ఎన్నికయ్యారని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని అన్నారు. అప్పుడే రెఫరెండం అనే డిమాండ్కు విశ్వసనీయ ఏర్పడుతుందని చెప్పారు. వైఎస్ జగన్, కేసీఆర్ తరహాలో చంద్రబాబు కూడా తాను చెప్తున్న మాటలమీద తనకే నమ్మకం ఇప్పటికిప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుందని సూచించారు.