‘అమరావతిని తరలించడం లేదు: తెలంగాణ అప్పు ఓకే.. చంద్రబాబు అప్పు లెక్కేది?’
అమరావతి: రాజధాని తరలింపుపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని ఎవరూ తరలించడం లేదని ఆయన స్పష్టం చేశారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, హైపవర్, తదితర కమిటీలు సూచించినట్లుగా అభివృద్ధి వికేంద్రకరణ జరగాలనే తాము కోరుకుంటున్నామని చెప్పారు.
అమరావతిని తరలించడం లేదు..
శనివారం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎవరూ తరలించడం లేదని, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మీకంత భయమెందుకని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి ప్రశ్నించారు. ఆఖరుకు కులాన్ని, మతాన్ని, దేవున్ని కూడా రోడ్లపైకి తెస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దుష్ట ఆలోచనలు మానుకోవాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ అప్పులు కనిపిస్తున్నాయి.. చంద్రబాబు చేసిన అప్పు లెక్కేది?
తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ కనిపిస్తున్నాయని.. చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో చేసిన అప్పులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్లో చేసిన అక్రమాలు బయటపడతాయనే చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబుకు సవాల్
దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. జగన్ చేసింది తప్పనిపిస్తే.. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి, ప్రజాతీర్పు కోరాలని అన్నారు. అప్పుడు ప్రజాభిప్రాయం తెలుస్తుందని చెప్పారు. ఆ ధైర్యం చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు మరో జోలే పట్టారు..
చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆందోళనలు ప్రజల కోసం కాదని.. తన బినామీల కోసమేనని, తన అవినీతి ఆస్తులను కాపాడుకోవడానికేనని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అమరావతి ముసుగులో రైతులతో కృత్రిమ ఉద్యమం సృష్టించారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల తరహాలో చంద్రబాబు వ్యవహరించడమే ఆయన మోసాలకు నిదర్శనమని అన్నారు. గతంలో ఈ-ఇటుక పేరుతో చంద్రబాబు చేసిన వసూళ్లకు లెక్క లేవని.. ఇప్పుడు మరో జోలే పడుతున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
విభేదాలు సృష్టించడం చంద్రబాబు నైజం
చంద్రబాబు గత ఐదేళ్లలో రైతులను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు నివాసం ఉన్న కరకట్ట వద్దకు వెళ్లి రైతులు నిలదీయాలని అన్నారు. 40వేల70 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించిందని చెప్పారు. ఇన్ సైడర్ అక్రమాలు వెలుగుచూశాయని, అందుకే చంద్రబాబు ఆందోళన చేపట్టారని మండిపడ్డారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం చంద్రబాబు నైజమన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం జగన్ పాలన చేస్తున్నారన్నారు. ఈ ఏడు నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.