చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ కోసం.. బస్తీమే సవాల్ అంటున్న పృథ్వీ..! జోలికొస్తే, తాట తీస్తా రాజేంద్ర ప్రసాద్ కు చురకలు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ప్రముఖ క్యారెక్టర్ నటుడు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పృథ్వీ.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే.. ఎవ్వరైనా సరే ఉపేక్షించబోనని, వారి తాట తీస్తానని హెచ్చరించారు. రాష్ట్రానికి కొత్తగా ఓ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఏ ఒక్క నటుడు కూడా అభినందించలేదనేది వాస్తవం అని, దీనిపై ఏదో ఆకాశం బద్ధలైనట్లు కొందరు వ్యాఖ్యానించడం సరికాదని పృథ్వీ చెప్పారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను దృష్టిలో ఉంచుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమను రెండుగా చీల్చేలా ఉన్నాయని, వర్గ విభేదాలను బీజం వేసేలా ఉన్నాయని పృథ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రగిరిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పృథ్వీ..

చంద్రగిరిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పృథ్వీ..

73వ స్వాతంత్య్ర దినోత్సవ సంరంభాన్ని పురస్కరించుకుని గురువారం చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగుర వేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో పాటు స్థానికులకు స్వీట్లను పంచి పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పృథ్వీ మాట్లాడారు. వైఎస్ జగన్ పై నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యానాలను కొందరు విలేకరులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యానాలపై పృథ్వీ మండిపడ్డారు. పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినంత మాత్రానా వెంటనే వెళ్లి, ఆయనను కలవాలా? నిదానంగా వెళ్లొచ్చు.. అంటూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

స్వామివారి దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటమా?

స్వామివారి దర్శనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటమా?

ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చిన వాళ్లు.. స్వామివారిని దర్శించుకుని వెళ్లడం మంచిదని అన్నారు. పవిత్రమైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం మొదటి తప్పు అని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, ఓ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత టాలీవుడ్ ప్రతినిధులుగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం కనీస ధర్మం అని అన్నారు. ఇదే విషయాన్ని తాను ప్రస్తావించానని అన్నారు. తన మాటల్లో తప్పేమీ లేదని చెప్పారు. తిరుమలకు వచ్చిన వాళ్లు స్వామి దర్శనం చేసుకుని వెళ్లాలే తప్ప, వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని, రాజకీయాలు మాట్లాడటం సహేతుకం కాదని హితవు పలికారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటిదాకా కలిసికట్టుగా ఉన్న చిత్ర పరిశ్రమను రెండుగా విభజించేలా ఉన్నాయని, వర్గ విభేదాలకు దారి తీసేలా ఆయన వ్యవహరించారని విమర్శించారు.

కేసీఆర్ ను కలవలేదా?

కేసీఆర్ ను కలవలేదా?

గత ఏడాది నవంబర్ లో తెలంగాణకు జరిగిన ఎన్నికల అనంతరం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని పృథ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని వైఎస్ జగన్ విషయంలో ఎందుకు అనుసరించట్లేదని ప్రశ్నించారు. అకారణంగా, అనవసరంగా వైఎస్ జగన్ జోలికి వచ్చినా, ఆయనను విమర్శించినా తాను ఎంత మాత్రం ఉపేక్షించబోనని, వారి తాట తీస్తానని పృథ్వీ హెచ్చరించారు. తాను డైహార్డ్ అభిమానినని చెప్పారు. ఎస్వీబీసీ వంటి పవిత్రమైన సంస్థకు ఛైర్మన్ గా ఉన్నందున తన గొంతు మూగబోయిందని అనుకోవద్దని తాను ప్రత్యర్థులకు హెచ్చరిస్తున్నానని అన్నారు. తనకు స్వామికార్యం తెలుసు, స్వకార్యమూ తెలుసని చెప్పారు. తిరుపతిలో ఉంటే శ్రీ వేంకటేశ్వర స్వామికి దాసుడిగా ఉంటానని, అమరావతికి వెళ్తే వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు.

పులి కడుపునా పులే.. లోకేష్ కాదు..

పులి కడుపునా పులే.. లోకేష్ కాదు..

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరు పెద్దలు.. లబ్ది పొందారని, ఈ విషయాన్ని అంత తొందరగా మరిచిపోకూడదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అద్భుతాలు చేస్తున్నారని ప్రశంసించారు. పులి కడుపున పులే పుడుతుందని, లోకేష్ పుట్టడని ఆయన ఎద్దేవా చేశారు.

అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నా..

అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నా..

వైఎస్ జగన్ తనకు గౌరవ ప్రదమైన పదవి ఇచ్చారని, దానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టడానికే తాను రాజకీయాలు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సత్కారాలు చేస్తారు గానీ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే విమర్శలు గుప్పిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో మంది సినిమా వాళ్లు లబ్ధి పొందారని పృథ్వీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. డల్లాస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనబోయే నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) సభల నిర్వహణ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తున్నారు. దీనితో పృథ్వీ.. పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

English summary
Tollywood actor, SVBC Chairman Prithvi was once again gave warning to some of actors belonging from Telugu Film Industry that, If anybody criticized Chief Minister of Andhra Pradesh YS Jaganmohan Reddy unnecessarily, I will not leave them. Prithvi indirectly warned to Co actor Rajendra Prasad, who was allegedly supporting to Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X