'పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్! సునీతను బర్తరఫ్ చేయాలి'
అనంతపురం: రాప్తాడు తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్లను ప్రోత్సహిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పది క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని ఆరోపించారు.
పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు
పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా అని ఆయన తుపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ పోలీసులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. వారికో చట్టం, ఇతరులకు మరో చట్టమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిటాల సునీతను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రి పరిటాల సునీతను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తోపుదుర్తి డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
గూండాగిరికి వత్తాసు పలకడం మంచిది కాదు
వైసీపీ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. టీడీపీ నేతల గూండాగిరికి పోలీసులు వత్తాసు పలకడం మంచిది కాదన్నారు. టీడీపీ నాయకులపై ఉన్న కేసుల్లో సరైన విచారణ జరగడం లేదన్నారు. వారిపై ఆలస్యంగా ఛార్జిషీట్లు నమోదు చేసి శిక్షలు పడకుండా పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు.
కేసు నమోదు
ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుడిని వారు డబ్బులు డిమాండ్ చేశారని అంటున్నారు. అతను పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.