అరచేతిలో వైకుంఠం: 'చంద్రబాబు వచ్చాక అభివృద్ధి కాదు అవినీతి పెరిగింది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని, అయితే ప్రసంగ పాఠం చూస్తే అన్ని అవాస్తవాలేనని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
ఏపీలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితులకు విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం చేశారని అన్నారు. ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకోవాలన్నా.. గతంలో కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఓ విషయం చెప్పారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రగతి రెండంకెల్లో సాధించాలని అనుకుంటే, అవినీతి రెండంకెల్లో సాధించామని చంద్రబాబే కేబినెట్ భేటీలో ఒప్పుకున్నారన్నారు.
గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ ప్రస్తావనే రాలేదని ఆయన మండిపడ్డారు. కానీ ప్రసంగంలో మాత్రం అవినీతిని సమూలంగా తుడిచిపెట్టినట్లు చెప్పడం చూస్తే ఆత్మను చంపుకోవడమేనని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కాకుండా అవినీతి పెరిగిందని ఎద్దేవా చేశారు.
జాతీయ వృద్ధిరేటు 7.31 శాతం ఉంటే ఇక్కడ మాత్రం 10.99 శాతం సాధించామని చెబుతుంటే అది ఎంతవరకు వాస్తవమని ప్రశ్నించారు. దీనిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారని అన్నారు. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు మరోవైపు జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధించినట్లు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేన్నారు.
దీంతో పాటు వ్యవసాయ రంగంలో దిగుబడి ఎంత తగ్గిందో చెప్పలేదని మండిపడ్డారు. సాగు విస్తీర్ణం, రైతుల ఆదాయం అన్నీ తగ్గాయని, నిత్యావసరాల రేట్లు పెరిగినా అవేవీ చెప్పలేదన్నారు. ఇళ్ల నిర్మాణంలో తామిచ్చేది కేవలం లక్ష రూపాయలేనని, మిగిలినది రుణంగా అందజేస్తామని చెప్పారని ఎద్దేవా చేశారు.
ఏపీలో కరువు లేదని చెబుతున్న ప్రభుత్వం, అనంతపురం జిల్లా నుంచి 4 లక్షల మంది ఎందుకు వలస వెళ్లారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగమంతా అర్ధసత్యాలు, అసత్యాలతోనే ఉందని ఉమ్మారెడ్డి మండిపడ్డారు.
మైండ్ గేమ్ ఆడటానికే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు: గిడ్డి ఈశ్వరి
మైండ్ గేమ్ ఆడటానికే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. సాధారణ ఎన్నికల్లో జగన్ జెండా, అజెండాతో గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరడం ఎంత వరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలకు నైతిక విలువలు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని అన్నారు.
టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు శనివారం నోటీసు ఇచ్చామని ఆమె తెలిపారు. ఏపీలో జరగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రజలు చూస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజక వర్గాలకు చంద్రబాబు నిధులివ్వడం లేదని ఆమె మండిపడ్డారు.
ఇదిలా ఉంటే గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఆదివారం, సోమవారం సెలవులు రావడంతో తిరిగి మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.