వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ గుడ్బై, జగన్పై తీవ్రవ్యాఖ్యలు: ఆ లేఖలో ఏముందంటే, టీడీపీలోకి వెళ్లడంపై..
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. ఆయన ఆదివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు.
విజయవాడ సెంట్రల్ సీటు పైన హామీ రాకపోవడంతో ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. వంగవీటిని పార్టీ వీడకుండా చేసేందుకు పలువురు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. బొత్స సత్యనారాయణ ఆదివారం కూడా చర్చించారు. కానీ ఆ సీటుపై వంగవీటి తగ్గలేదు. అసంతృప్తితో చర్చలు ముగిశాయి.
జగన్కు రాసిన లేఖలో ఏం చెప్పారంటే?
పేద ప్రజల స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే తన ప్రయాణం ఉంటుందని, ప్రజల ఆశయాలను కొనసాగించే దిశలో ప్రయాణం సాగించాలన్నదే తన ఆకాంక్ష అని, ముఖ్యమంత్రి కావాలన్న మీ (జగన్) కాంక్ష నెరవేరాలంటే వైసీపీలో అందరికీ ఆంక్షలు విధించడం తప్పనిసరి అని, కానీ తన ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తప్పనిసరి అని.. జగన్కు రాసిన రాజీనామా లేఖలో వంగవీటి రాధాకృష్ణ పేర్కొన్నారు.
ఓర్పుతో ఉన్నాఉన్నా
వంగవీటి రాధాకృష్ణ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గతంలోనే తన రాజీనామా లేఖను జగన్కు పంపించానని చెప్పారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. వైసీపీలో కష్టపడి పని చేసినప్పటికీ జగన్ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా ఓర్పుతో ఉన్నానని, అయినప్పటికీ విజయవాడ సెంట్రల్ టికెట్ విషయమై జగన్ స్పందించలేదని చెప్పారు.
ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు
వైసీపీలో తన ఆకాంక్షలు నెరవేరడం లేదని, ఆకాంక్షలు నెరవేరాలంటే ఎలాంటి ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తనకు అవసరమని వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. తన తండ్రి వంగవీటి రంగా ఆశయాలు కొనసాగించడం కోసం ప్రజాప్రయాణం చేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ఆంక్షలు ఎక్కువగా ఉండటం వల్లే వైసీపీకి రాజీనామా చేశానని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ఆధారపడే మనస్తత్వం తనది కాదన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని జగన్ను కోరారు.
టీడీపీలోకి వెళ్తున్నారట అనగా
తాను రాజకీయాలను వదిలి వెళ్లడం లేదని, రాజకీయాల్లో కొనసాగుతానని రాధాకృష్ణ తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. టీడీపీలో చేరుతారని ప్రచారం సాగుతోందని అడగగా.. అన్ని విషయాలను తన అభిమానులతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయానికి గల కారణాలపై అందరితో చర్చించాల్సి ఉందన్నారు.