విజయసాయి.. యడియూరప్ప.. మధ్యలో హిమాలయ వాటర్ బాటిల్!
బెంగళూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చేసిన ఓ ట్వీట్.. విమర్శలకు తావిస్తోంది. ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. ఆలోచించి చేశారో, అనాలోచితంగా ఆ ట్వీట్ చేశారో తెలియట్లేదు గానీ.. వేలెత్తి చూపేలా చేస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడియూరప్పకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ట్వీట్ అంది. యడియూరప్పకు శుభాకాంక్షలు చెప్పడం, ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయడం సమస్యలను సృష్టించేదేమీ కాదు. ఈ ఫొటోలో ఓ యడియూరప్ప, మరోపక్క విజయసాయి రెడ్డి ఉన్నారు. మధ్యలో హిమాలయ వాటర్ బాటిల్ కనిపిస్తోంది. అసలు చిక్కంతా అక్కడే వచ్చింది. నిజానికి- ఆ ఫొటో ఇప్పటిది కాదు. యడియూరప్ప లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పటి పిక్ అది.
యడియూరప్ప తప్పిన ముహూర్తం: ఇది కూడా ముణ్నాళ్ల ముచ్చట కాదు కదా!
హిమాలయ బ్రాండ్..సరికొత్త విమర్శలకు ట్రెండ్..
హిమాలయ వాటర్ బాటిల్ను విజయసాయి రెడ్డి ఎంతగా వ్యతిరేకిస్తారో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఈ బాటిల్ను అడ్డుగా పెట్టుకుని ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్పై ఏ రేంజ్లో చెలరేగిపోయారో మనం చూశాం. ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తూ ఆ ఇద్దరినీ చెడుగుడు ఆడుకున్నారాయన. హిమాలయ వాటర్ బాటిల్ కనిపించిన ప్రతి ఫొటోను ట్వీట్ చేస్తూ వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు. ఈ అంశం ప్రజల్లో బాగా చొచ్చుకు వెళ్లింది. చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడటానికి కొద్దో, గొప్పో సహకరించింది.
సదా వారిద్దరి పక్కనే..
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇదివరకు అధికారులతో సమీక్షలు నిర్వహించినా, మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినా, పార్టీ నాయకులతో భేటీ చేపట్టినా.. హిమాలయా బాటిల్ కామన్గా కనిపిస్తుండేది. మిగిలిన వారికి సాధారణ వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాత్రం హిమాలయ బాటిల్ను తమ వద్ద ఉంచుకునే వారు. ఇతర ప్యాకేజీ డ్రింక్లతో పోల్చుకుంటే హిమాలయ ధర కాస్త ఎక్కువే. ఈ రకంగా ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేస్తున్నారంటూ వారిద్దరిపైనా ఘాటు విమర్శలు చేసేవారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు- ఇక హిమాలయ వాటర్ బాటిల్స్ తమ సమావేశాల్లో కనిపించవని స్పష్టం చేశారు.
విమర్శల జడివానకు అవకాశం ఇచ్చినట్టే?
తాజాగా- అదే వాటర్ బాటిల్తో విజయసాయి రెడ్డి దొరికిపోయారు. హిమాలయ వాటర్ బాటిల్ను విజయసాయి రెడ్డే వినియోగిస్తున్నారని ఖచ్చితంగా చెప్పలేం. సాయిరెడ్డి గానీ, ఆయన పక్కనే కూర్చున్న యడియూరప్ప గానీ దాన్ని వాడుతూ ఉండొచ్చు. అయినప్పటికీ- విమర్శించాలనుకునే వారికి అవేవీ బుర్రకు ఎక్కవు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అయిన దానికీ, కాని దానికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు మాత్రమే. ఈ కాస్త సమయంలోనే అద్భుతాలు సృష్టించాల్సిందేనని శాసిస్తోంది తెలుగుదేశం పార్టీ. అయిదేళ్లు తాము అధికారంలో ఉన్న విషయాన్ని విస్మరిస్తోంది. తమ పరిపాలనా కాలంలో చేయలేని పనులన్నింటినీ ఈ రెండు నెలల్లోనే ఎందుకు పూర్తి చేయలేదని నిలదీస్తోంది.
సాయిరెడ్డిని టార్గెట్ చేస్తారా?
ప్రత్యేకించి- విజయసాయి రెడ్డి మీద అక్కసుతో ఉన్నట్లు కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. సాయిరెడ్డి ఏ చిన్న తప్పు చేసినా విమర్శల జడివాన కురిపించడానికి సిద్ధంగా ఉంటోంది ముందు, వెనుకా ఆలోచించకుండా. ఈ లాంటి పరిస్థితుల్లో హిమాలయా వాటర్ బాటిల్తో సాయిరెడ్డి దొరికి పోవడం టీడీపీ సోషల్ మీడియాకు ఓ అవకాశాన్ని కల్పించినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా విమర్శలకు తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదనే అభిప్రాయం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఉంది.