తాడిపత్రిలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డిపై దాడికి యత్నం, పోలీసుల ఎంట్రీతో..
అనంతపురం: స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తాడిపత్రిలోనూ అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదాలు, దాడులు చోటు చేసుకున్నాయి.
తాడిపత్రిలో ఉద్రిక్తత..
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు కార్యాలయం వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
జేసీని అడ్డుకున్నారు..
కాగా, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. టీడీపీ తరపున నామినేషన్ వేస్తున్నవారిని అడ్డుకుని బెదిరిస్తున్నారని 36వ వార్డు టీడీపీ అభ్యర్థిని జింక లక్ష్మీదేవి ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ దివాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలోకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
దివాకర్ రెడ్డిపై దాడికి యత్నం..
కార్యాలయంలో హర్షవర్ధన్ ఉన్నందన తర్వాత పంపిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, పోలీసులు మాట్లాడుతున్న సమయంలోనే.. జేసీ దివాకర్ రెడ్డిపైకి దూసుకొచ్చారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఓ వైసీపీ నాయకుడు.. జేపీపై దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అడ్డుకుని జేసీని సురక్షితంగా అక్కడ నుంచి పంపించారు. భారీ ఎత్తున అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో కొంత సేపటి వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.
Recommended Video
తిరుపతిలోనూ..
తిరుపతిలో కూడా వైసీపీ నేతలు నామినేషన్లను అడ్డుకున్నారు. నామినేషన్లకు 45 నిమిషాల సమయం ఉండగానే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం గేట్లను మూసివేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆవరణలోనే 9,10,11,12 వార్డు సచివాలయ కార్యాలయాలు ఉండగా.. అక్కడికి వైసీపీ మినహా ఇతర అభ్యర్థులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఓ బీజేపీ నేత నామినేషన్ వేసేందుకు యత్నించగా.. అతడ్ని కూడా అక్కడ్నుంచి బలవంతంగా పంపించేశారు వైసీపీ నేతలు.