చావాలనుకున్న నువ్వు ధైర్యవంతుడివా, టీడీపీకి పవన్ అందుకే దూరమయ్యారా?
అమరావతి: సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆదివారం నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంతో ఏమొస్తుందన్న చంద్రబాబు ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని, ప్రత్యేక హోదాపై అలాగే వ్యవహరించారన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీ వచ్చి మద్దతు కూడగడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ పారిపోయారని ఎద్దేవా చేశారు.
ప్రచారానికి నేను, ఫోన్ చేస్తే లైన్లోకి రాలేదు: బీజేపీ ఎంపీపై పవన్, బాబూ ఇక్కడకొచ్చి కూర్చో
మీరు చెప్పింది వినేందుకు ప్రజలు అమాయకులు కాదన్నారు. ఏపీలో ఎక్కడా పాలన సరిగా లేదన్నారు. ప్రజలు అప్రమత్తమంగా ఉండాలన్నారు. చంద్రబాబు అవినీతి ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు చంద్రబాబు గేమ్ ఆడుతున్నారన్నారు. కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు అంత సంపాదన ఎక్కడిది?
పట్టిసీమ నుంచి పంచభూతాలను పంచుకొని తింటున్నారని బోత్స మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందన్నారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని, అలాంటి తమ ఎంపీలపై విమర్శలు విడ్డూరమన్నారు. హోదా, విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మోసం చేసి ఓట్లు కాజేసే చరిత్ర టీడీపీది అన్నారు. అందుకే కాపులకు రిజర్వేషన్లు అన్నారని, వాటిని ఇవ్వలేదని, తాము మాత్రం బీసీలకు అన్యాయం జరగకుండా ఇవ్వాలని చెప్పామన్నారు.
పవన్ ఇప్పుడు ప్రవచనాలు పలుకుతున్నారు
రైల్వే జోన్ కుదరదని బీజేపీ చెబుతుంటే వీరంతా ఏం చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. ఇలాగే చేస్తే కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. ఏపీ ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారన్నారు. ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో పవన్ ప్రవచనాలు చెబుతున్నారని, కానీ తాము అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకోవాలన్నారు. కాపు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, జగన్ ఉన్నది ఉన్నట్లు చెప్పారన్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయని, తాను ఏం చేయలేనని జగన్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
మునికోటి కుటుంబాన్ని ఆదుకోలేదు
ప్రత్యేక హోదా కోసం ఇంకెంతమంది ప్రాణాలు తీసుకోవాలని వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా వేరుగా అన్నారు. నాడు హోదా కోసం ఆత్మార్పణం చేసిన మునికోటి కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమాలు చేస్తుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో డ్రామాలు చేయడం తప్ప నిలదీయడం లేదన్నారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని టీడీపీ, బీజేపీలను ప్రశ్నించారు.
పవన్ అందుకే బయటకు వచ్చారా?
నాలుగేళ్ల పాటు టీడీపీతో అంటకాగిన పవన్ ఇప్పుడు టీడీపీని వదిలి, వైసీపీని విమర్శిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు మాదిరే పవన్ కూడా మాట్లాడుతున్నారన్నారు. తనకు తానే ఉత్తముడినంటూ కితాబిచ్చుకుంటున్నారన్నారు. తాను అసెంబ్లీలో ఉంటే ఒక ఊపు ఊపేవాడినంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు రాజ్యసభ సీటు ఇస్తానంటే ఎన్నికల్లో పోటీ చేయలేదని పవన్ అన్నారని, ఇప్పుడు సీటు ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చారా అన్నారు.
చావాలనుకున్న నువ్వు ధైర్యవంతుడివా?
ఒకనొక సమయంలో రివాల్వర్తో కాల్చుకుని చావాలనుకున్నానని సభల్లో పవన్ చెబుతున్నారని, జీవితంలో పోరాడలేక చావాలనుకున్న వ్యక్తిని ఎవరైనా ధైర్యవంతుడు అంటారా? అని అంబటి ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబుకు ఎందుకు మద్దతు పలికారో చెప్పాలన్నారు. వ్యక్తిగత అంశాల గురించి ప్రశ్నిస్తే పవన్ ఎందుకు భయపడుతున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. తన మాటలను పవన్ అదుపులో పెట్టుకోవాలన్నారు.