రూటుమార్చిన వైసీపీ.. రఘురామకృష్ణంరాజు అరెస్టు తప్పదా ? ఇవాళ మరో ఎమ్మెల్యే ఫిర్యాదు...
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర చర్యలకు వైసీపీ సిద్దమవుతోందా ? నిన్న మంత్రి రంగనాథరాజు తరఫున ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఇవాళ మరో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా దాదాపు ఇదే కారణాలతో ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. గతంలో తాను విమర్శించిన నరసాపురం ఎంపీ స్ధానం పరిధిలోని ఎమ్మెల్యేలతో వైసీపీ కేసులు పెట్టించడం చూస్తుంటే రఘురామకృష్ణంరాజు అరెస్టు తప్పదనే చర్చ మొదలైంది. ఇప్పటికే లోక్ సభ స్పీకర్ వద్ద ఆయనపై ఫిర్యాదు పెండింగ్ లో ఉన్న తరుణంలో వైసీపీ దూకుడు ఆసక్తి రేపుతోంది.
ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు- వైసీపీ నుంచి రక్షించాలని కేంద్రానికి వేడుకోలు...
రూటు మారుస్తున్న వైసీపీ..
వైసీపీ తరఫున గెలిచి సీఎం జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. పార్టీపై ధిక్కార స్వరం విషయంలో అనర్హత వేటు వేయాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ... ఆ లోపే ఆయనపై చర్యలకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో తాను విమర్శించిన నేతలందరితో ఒక్కొక్కరిగా పోలీసులకు ఫిర్యాదులు చేయిస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యేలుగా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కూడా ఫిర్యాదు చేయించింది.
నిన్న మంత్రి.. ఇవాళ ఎమ్మెల్యే ఫిర్యాదు...
మంత్రిగా ఉన్న తనపై విమర్శలు చేసిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రంగనాథరాజు ఆచంట నియోజకవర్గంలోని పోడూరు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, అసత్య ఆరోపణలతో పరువుకు భంగం కలిగించారని రంగనాథరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది జరిగిన 24 గంటల్లోపే నరసాపురం ఎంపీ స్ధానం పరిధిలోకి వచ్చే మరో నియోజకవర్గం భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా దాదాపు ఇదే కారణాలతో రఘురామకృష్ణంరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీలో వర్గ విభేదాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయని గ్రంథి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత ముదిరింది.
రఘురామ అరెస్టు తప్పదా ?
ఓవైపు లోక్ సభ స్పీకర్ పరిధిలో అనర్హత వేటు ఫిర్యాదు పెండింగ్ లో ఉండగానే వైసీపీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే ఒకరి తర్వాత మరొకరు రఘురామకృష్ణంరాజుపై పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వడం చూస్తుంటే ఏదో జరగబోతోందని ఇట్టే అర్దమవుతోంది. గతంలో తన నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు అందరిపైనా రఘురామకృష్ణంరాజు తీవ్ర స్ధాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో ఇప్పుడు ఆ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకునే వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేస్తున్నారా లేక వైసీపీ అధిష్టానం ఆదేశాలతోనే వీరు రంగంలోకి దిగారా అన్నది స్పష్టం కాలేదు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో వదిలేసి తాజాగా ఫిర్యాదులు చేయడం చూస్తుంటే రఘురామకృష్ణంరాజు అరెస్టును వీరు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదుల్లో వీరు పేర్కొంటున్న కారణాలు కూడా ఈ వాదనను బలపరిచేలా ఉన్నాయి.
రఘురాముడి తదుపరి వ్యూహమేంటి ?
వైసీపీ ఎమ్మెల్యే, మంత్రుల ఫిర్యాదుతో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా అప్రమత్తమవుతున్నారు. వరుస ఫిర్యాదులు చూస్తుంటే తనను క్షేత్రస్ధాయిలో టార్గెట్ చేశారనే అంచనాకు ఆయన వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఫిర్యాదు చేయించడం ద్వారా తనను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని రఘురామ భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని మరోసారి స్పీకర్, కేంద్రం వద్దకు తీసుకెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనలో కనిపిస్తోంది. వైసీపీతో విభేదిస్తున్నందున జగన్ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని, ఇది ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించడమే అన్న వాదనను ఆయన స్పీకర్ వద్దకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.