48 గంటల డెడ్లైన్: లాజిక్ లాగుతోన్న వైసీపీ: స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డు..అసెంబ్లీ రద్దు ఎలా?
అమరావతి: మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ పెద్ద ఎత్తున సన్నాహాలు సాగిస్తోన్న వేళ.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఘాటు విమర్శలను సంధిస్తున్నారు. సవాళ్లను విసురుతున్నారు. అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, తాజాగా ఎన్నికలకు వెళ్లాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేసిన సమయంలోనే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రకమైన సవాల్ విసిరారు.
చంద్రబాబు అల్టిమేటం
తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 48 గంటల పాటు గడువు ఇస్తున్నానని, ఈ లోగా అసెంబ్లీని రద్దు చేసి, కొత్తగా ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన గడువులోగా అసెంబ్లీని రద్దు చేయకపోతే.. తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఇక తాము మూడు రాజధానుల జోలికి రాబోమని ఆఫర్ కూడా పెట్టారు.
కరోనా అడ్డుపడదా?
సరిగ్గా.. ఇక్కడే వైఎస్ఆర్సీపీ నేతలు లాజిక్ను లాగుతున్నారు. కరోనా వైరస్ పేరును అడ్డుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇదివరకు స్థానిక సంస్థలను రద్దు చేయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేసిన చంద్రబాబు.. అదే నోటితో అసెంబ్లీని రద్దు చేయమని అడగడం.. కొత్తగా మళ్లీ ఎన్నికలను నిర్వహించాలనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కరోనా ప్రారంభదశలోనే ఉన్నా..
ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందలేదని, అలాంటి పరిస్థితుల్లోనే తన పలుకుబడిని ఉపయోగించి స్థానిక సంస్థ ఎన్నికలను రద్దు చేయించారని ఆరోపిస్తున్నారు. తాజాగా రోజువారీ వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీకి తాజాగా ఎన్నికలను నిర్వహించాలని చంద్రబాబు అల్టిమేటం జారీ చేయడం ఆయన రెండు కళ్ల సిద్ధాంతానికి నిదర్శనమని మండిపడుతున్నారు.
ఉద్దేశపూరకంగానే స్థానిక ఎన్నికలు రద్దు..
వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ చంద్రబాబు తాజాగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేయడాన్ని బట్టి చూస్తోంటే..స్థానిక సంస్థల ఎన్నికలను ఆయన ఉద్దేశపూరకంగానే రద్దు చేయించారనేది స్పష్టమౌతోందని వైసీపీ నేతలు అంటున్నారు. తాము ఓడిపోతున్నామని తెలిసే చంద్రబాబు.. ఎన్నికల కమిషనర్ను ప్రభావితం చేశారని, కరోనాను అడ్డుగా పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు అయ్యేలా చేశారనేది తేలిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
Recommended Video
కుప్పం ప్రజలకు ఏ సమాధానం?
హైదరాబాద్లో కూర్చుని చంద్రబాబు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం, తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శంచడం సరికాదని హితవు పలుకుతున్నారు. రాష్ట్ర ప్రజల మీద, అమరావతి రైతుల మీద చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే.. వెంటనే ఉండవల్లి నివాసానికి రావాలని ప్రతిసవాల్ విసురుతున్నారు. ఆయన ప్రభుత్వం మీద సవాళ్లు విసరడం కాదని, ఆయన సొంత నియోజకవర్గం ఖాళీ అవుతుందని, ముందు ఆ సంగతి పట్టించుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తోన్న కుప్పం ప్రజలకు ఏం సమాధానం ఇస్తారని నిలదీస్తున్నారు.