గుడి దగ్గరనా, జగన్ గురించి మీకే తెలియదు: రోజాపై సుజాత, సింగపూర్లో నారాయణ
అమరావతి: దైవదర్శనానికి వెళ్లిన సమయంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా రాజకీయం చేయడం సరికాదని మంత్రి పీతల సుజాత మంగళవారం నాడు అన్నారు. అసలు వారి పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఎక్కడకు వెళ్తున్నారో ఆ పార్టీ వారికి తెలుసా అని ప్రశ్నించారు.
వైయస్ జగన్ ఎక్కడకు వెళ్తారో, ఏం చేస్తారో, ఎప్పుడు వస్తారో కూడా ఆ పార్టీ వారికి తెలియదని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాంతంలో నాలుగు లక్షల ఎకరాలు ఎండిపోకుండా చేసిన విషయం రోజాకు కనిపించడం లేదా అని నిలదీశారు.
మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని సీఎం కార్యాలయంలో మంగళవారం నాడు మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు, పుష్కరాలు, రాయలసీమలో కరవుపై మంత్రులు చర్చించనున్నారు. జీఎస్టీ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్రానికి కేంద్రం సాయంపైనా మంత్రివర్గం చర్చించనుంది. మంత్రివర్గం ముగిశాక పార్టీ ముఖ్యనేతలతో సీఎం భేటీ కానున్నారు.
స్మార్ట్ స్టేట్గా మార్చడమే లక్ష్యం: నారాయణ
ఏపీని స్మార్ట్ స్టేట్గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ ప్రకటించారు. ఆయన సింగపూర్లో పర్యటిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి పలు అధునాతన నగరాలను సందర్శించేందుకు పర్యటిస్తున్నారు.
అక్కడి సర్బనా, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్, ఏటోస్ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగిస్తే అద్భుతమైన నగరాలను ఏర్పాటు చేయవచ్చన్నారు.
భద్రతకు సంబంధించి ఏటోస్ సంస్థ వద్ద ఉన్న పరిఙ్ఞానాన్ని ఒక్క అమరావతిలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని నగరాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో వినియోగిస్తే మెరుగైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చన్నారు. ఏటోస్తో పాటు సర్బనా, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ వద్ద ఉన్న సాంకేతికను వినియోగించుకుని ఏపీని స్మార్ట్ స్టేట్గా తీర్చిదిద్దుతామన్నారు.