'లింగమనేని' తప్పించారేం: ఆళ్ల, చంద్రబాబుపై ముప్పేట దాడి
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో ఎంత లూటీ చేస్తున్నారో తాము ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్తామని, అక్రమంగా కట్టిన లింగమనేని గెస్ట్ హౌస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్నారని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
రాజధానికి మేం వ్యతిరేకం కాదని, కానీ ప్రస్తుత రాజధాని రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక రాజధాని అన్నారు. తాము పక్కా సాక్ష్యాధారాలతో టిడిపి నేతల రాజధాని దందా పైన ముందుకు వచ్చామని చెప్పారు. చంద్రబాబు స్వయంగా అక్రమంగా కట్టిన లింగమనేని అతిథి గృహంలో ఉంటున్నారని చెప్పారు.
రాజధాని భూముల అక్రమాల పైన న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ నుంచి లింగమనేని గెస్ట్ హౌస్ను ఎందుకు తప్పించారో చెప్పాలన్నారు. క్విడ్ ప్రోకో కింద టిడిపి నేతలు భూములు కొనుక్కున్నారని చెప్పారు.
లింగమనేని వారు కరకట్ట పైన అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకున్నారని, అందులో చంద్రబాబు ఉంటున్నారన్నారు. నదీ తీరంలో ఎలాంటి కట్టడం కట్టవద్దని, కానీ అక్కడ కట్టడం సరికాదన్నారు. వందలాది ఏళ్ల క్రితం నిర్మించిన కరకట్టను పక్కకు తప్పించి భవనాలు నిర్మించుకున్నారని ఆరోపించారు.
లింగమనేని వారి భవంతులను అన్నింటిని ప్రభుత్వం గ్రామ కంఠాలుగా నిర్ణయించడం విడ్డూరమన్నారు. తమ పార్టీ ప్రతి రైతుకు, ప్రతి పేదవాడికి అండగా నిలబడుతుందని చెప్పారు. తమకు కమ్యూనిస్టులు, రైతు సంఘాలు మద్దతు పలుకుతున్నారన్నారు.
10న నారావారిపల్లెలో విశ్వరూప పాదయాత్ర: మందకృష్ణ
ఈ నెల 10వ తేదీన నారావారిపల్లెలో విశ్వరూపం పాదయాత్ర చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరింటకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. ఈ నెల 30న విజయవాడలో విశ్వరూప సభ ఉంటుందన్నారు.
ఇప్పటికే కాపు నేత ముద్రగడ పద్మనాభం.. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, తాను ఈ నెల 11 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు. మరోవైపు రాజధానిలో భూభాగోతం అని వైసిపి నేతలు, సాక్షి మీడియా మండిపడుతోంది. తద్వారా చంద్రబాబు పైన ముప్పేట దాడి జరుగుతోంది.
కెసిఆర్ను ప్రశ్నించడేం, శాంతిభద్రతలు దెబ్బతీసే కుట్ర: రావెల
ఏపీలో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మంత్రి రావెల కిషోర్ శుక్రవారం వ్యాఖ్యానించారు. జగన్ డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతోందన్నారు.
తెలంగాణలో మాదిగలకు న్యాయం చేయలేని కెసిఆర్ను ప్రశ్నించని మందకృష్ణ మాదిగ.. ఇక్కడ ప్రశ్నించడం విడ్డూరమన్నారు. తాము మాదిగల కోసం చేసిన పనిని తెలంగాణలో చేయలేదని దానిని ప్రశ్నించాలన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో దళితుల కోసం పని చేస్తోందన్నారు.