చంద్రబాబు మానసిక పరిస్థితిపై అనుమానులు: పార్థసారథి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి, కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి నుంచి వెయ్యి టీఎంసీల నీటిని తరలించడం ఎలా సాధ్యమని చంద్రబాబును ప్రశ్నించారు.
ఓ పక్క వెయ్యి టీఎంసీల నీటిని తరలించడమే ప్రశ్నార్థకమైతే.. ఆ నీటి ద్వారా రెండు కోట్ల ఎకరాలు సాగు చేయిస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో అర్ధంలేదన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు మానసిక పరిస్థితిపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
పోలవరం, పట్టిసీమ గోదావరి జలాలపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా? అని పార్థసారథి, సుబ్బారాయుడు సవాల్ విసిరారు. నీరు చెట్టు కార్యక్రమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పోలవరంపై ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలను గాలికొదిలేసింది
ఆర్టీసీ కార్మికుల కష్టాలను తెలుగుదేశం ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి మండిపడ్డారు. కార్మికుల సమస్యపై వేసిన ఉపసంఘం ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. మంత్రులు శిద్ధ రాఘవరావు, అచ్చెన్నాయుడు సొంత జిల్లాల్లో తిరుగుతుంటే.. మరో మంత్రి యనమల ఢిల్లీలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ఇంత పెద్ద సమస్యల నెలకొని ఉంటే.. సిఎం చంద్రబాబు మాత్రం జిల్లాల్లో యాత్రలు చేసుకుంటూ ఉన్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింజజేయాలని కోరారు.