టీవీల్లో నవ్వులు..! నియోజకవర్గంలో పువ్వులు..! ఎమ్మెల్యే రోజా పై కస్సుమంటున్న సొంతపార్టీ నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : రోజా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఎమ్మెల్యే రోజా గా అసెంబ్లీని కుదిపేసినా.. అఘాయిత్యాలకు గురైన అమాయక అమ్మాయిలకు ఆసరాగా నిలిచినా.. జనరంజకంగా మారిన జబర్ధస్త్ కార్యక్రమంలో జడ్జ్ మెంట్ ఇచ్చినా ఆమె మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చే ఆమె తెగింపు, తెగువ సాహసోపేతంగా ఉంటుందనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. తాజాగా కరోనా క్లిష్ట సమయంలో రాజకీయంతో పాటు అన్ని వ్యవస్ధలు షట్ డౌన్ ఐనప్పటికీ నగరి నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా రోజా కీర్తి మాత్రం అప్రతిహతంగా దూసుకెళ్తోంది. ఇదే అంశం రోజా మీద పూల వర్షం కురిపిస్తుంటే ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు ముళ్లు గుచ్చినట్టవుతోందనే చర్చ జరుగుతోంది.
Recommended Video
ఎమ్మెల్యే రోజా కు పూల వర్షం.. కరోనా వైరకస్ లా వ్యాప్తి చెందుతున్న రోజా కీర్తి..
కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తోంది. నగరి ఎమ్మెల్యే రోజా కీర్తి ప్రతిష్టలు కూడా కరోనా వైరస్ తో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్న ప్రస్తుత తరుణంలో తన నియోజక వర్గంలో మాత్రం ఓ గ్రామంలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపించదనే కారణంలో ఎమ్మెల్యే రోజాకు పుష్పాభిషేకం చేసారు గ్రామ ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న ఆంక్షలు ఉన్నప్పటికి, సమూహాలుగా ప్రజలు వీధుల్లోకి రావొద్దన్ని నిబంధనలు అమలులో ఉన్నప్పిటికి రోజా అంశంలో అవన్నీ బలాదూర్ గా మారిపోయాయన్న టాక్ వినిపిస్తోంది.
రోజా వ్యవహారంపై కస్సుమంటున్న సొంత పార్టీ నేతలు..
కాగా చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాలను సైతం రోజా తన సొంత ఖాతాలో వేసుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజక వర్గ నేతలనే కాకుండా సహచర ఎమ్మెల్యేలతో పాటు, జిల్లా మంత్రిని సైతం రోజా పట్టించుకోకుండా ఏక పక్షంగా ముందుకు వెళ్తుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. సహచర భాగస్వామ్యంతో జరిగే కార్యక్రమాలను కూడా రోజా వ్యక్తిగతంగా సాధించినట్టు చిత్రీకరిస్తోందని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలను కూడా అదే విధంగా మోటివేట్ చేస్తూ సొంత భజన చేయించుకుంన్నారని రోజా ప్రత్యర్ధులు ఘాటుగా విమర్శిస్తున్నారు. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న తరుణంలో ప్రజలతో పూలు జల్లించుకోవడం ఏంటని పొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అంతర్గత విభేదాలతో అట్టుడుకుతున్న జిల్లా..
చిత్తూరు జిల్లాలో రోజా ఏకపక్ష వ్యవహారం శృతిమించుతోందనే చర్య జరగుతోంది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తో ఎమ్మెల్యే రోజాకు ఎప్పటినుండో వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది. రోజాను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా అడ్డుకుంది పెద్దిరెడ్డి రాంచద్రారెడ్డేనని రోజా వర్గీయులు స్పష్టం చేస్తుంటారు. అధికారిక కార్యకరమాలకు చాలా వరకు రోజాకు అంత ప్రాధాన్యత ఇవ్వరనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో ఉంది. దీంతో రోజా తన పని తాను చేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడటం అలవాటుగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. నగరి నియోజక వర్గంలో ప్రజా సమస్యలే తన సమస్యలుగా బావించి పరిష్కరిస్తూ ముందుకు వెళ్తోంది ఎమ్మెల్యే రోజా. ఇవే కార్యక్రమాలు రోజా పై పూల వర్షం కురిపించేందుకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది.
కరోనా క్లిష్ట సమయంలో పూలాభిషేకం ఏంటి..
జిల్లాలో రోజా దూకుడు వ్యవహారం పట్ల ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూధన్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. నగరి నియోజకవర్గంలోని ఓ గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించినందుకు రోజా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆమే పాదాలపై పుష్ప వర్షం కురిపించారు ఆ గ్రామ మహిళలు. రోజాకు ఇరువైపులా నుంచున్న మహిళలు మాస్కులు ధరించి మరీ రోజాపై పూల వర్షం కురిపించారు. గ్రామ మహిళలు పూలు జల్లుతున్న వీడియోలో ఒక్క రోజా తప్ప జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క నేత కూడా లేరు. ఇదే అంశం సహచర ఎమ్మెల్యేలకు, జిల్లా మంత్రికి ఆగ్రహాన్ని తెప్పించినట్టు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.