జగన్కు రివర్స్!: విదేశీ టూర్, కలవరపెడుతున్న సొంత ఎమ్మెల్యేలు?
విజయవాడ: జూలై 8వ తేదీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 'గడపడగడపకూ వైసిపి' కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే పార్టీ అధినేత జగన్ విదేశాల్లో సరదాగా గడుపుతున్నారు. త్వరలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అమెరికా తరలనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వీరి పర్యటన దాదాపు నెల రోజుల వరకు ఉండనుందని తెలుస్తోందని అంటున్నారు. ఇది వైసిపిలో కలవరం కలిగిస్తోందని అంటున్నారు. జూలై 8న గడపగడపకూ కార్యక్రమం నేపథ్యంలో ముఖ్య నేతలు విదేశీ పర్యటనలో ఉంటే ఎలా అనే చర్చ సాగుతోందంట.
గడపగడపకూ కార్యక్రమం ద్వారా... ఎమ్మెల్యేల ఫిరాయింపులు, రాష్ట్రంలోని సమస్యలు, ఉద్యోగుల తరలింపు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజాప్రతినిధులు జూలై మొదటివారంలోనే 21 మంది ఎమ్మెల్యేలు విహారయాత్ర తలపెట్టారని అంటున్నారు.
అమెరికాలో వచ్చే నెలలో జరిగే ఆటా మహాసభలకు వైసీపీ ఎమ్మెల్యేలకూ ఆహ్వానాలు అందాయి. ఈ మహాసభలకు వెళ్లి పనిలోపనిగా నెల రోజులపాటు అమెరికాను చుట్టేయాలని వీరు ఉబలాటపడుతున్నారట. ఏ పరిస్థితుల్లోనూ 7వ తేదీలోపు వచ్చేయాలని పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.
తాము ప్లాన్ చేసుకున్నామని, ఇప్పటికి ఇప్పుడు రమ్మంటె ఎలా అని వారు వాపోతున్నారంటున్నారు. మరోవైపు, జగన్ కుటుంబ సమేతంగా బ్రిటన్లో ఉన్నారు. ఆయనతో చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విషయాన్ని... విదేశీ టూర్ ఫిక్స్ చేసుకున్న ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారంటున్నారు.
గతంలోనే. రాజ్యసభ ఎన్నికలకు ముందు ప్రజాప్రతినిధులు విదేశాలకు వెళ్లాలనుకున్నారని, కానీ రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే ఎలా వెళ్తారని జగన్ కస్సుమన్నారని, అయితే, ఇప్పుడు జగన్ ఎలా వెళ్లారని పార్టీలోనే చర్చించుకుంటున్నారంటున్నారు.