విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున: సమీక్షపై బీజేపీ: ఏపీలో ఒకలా.. తెలంగాణలో ఒకలా: వైసీపీ
అమరావతి: భారతీయ జనతా పార్టీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలకు లక్ష్యంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పున:సమీక్ష వ్యవహారంలో బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రవర్తిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ లో విద్యుత్ ఒప్పందాల్లో వందల కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారాయని, పీపీఏలను పున: సమీక్షించాలంటూ ఆరోపిస్తోన్న బీజేపీ నాయకులు.. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే తరహా నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకులు మరోసారి తన రెండు నాల్కల ధోరణిి బయట పెట్టారని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను నిజం చేస్తున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని, దీనిపై విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రైవేటు విద్యుత్ ఉత్పాదక కంపెనీలకు లబ్ది కలిగించి, వారి నుంచి పెద్ద ఎత్తున కమిషన్లను తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిామండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే కేసీఆర్ ప్రభుత్వ బండారం బట్టబయలవుతుందని అన్నారు. డాక్టర్ కే లక్ష్మణ్ చేసిన ఈ ప్రకటన ఏపీలో రాజకీయంగా ప్రకంపనలను పుట్టిస్తోంది. బీజేపీ ఏపీ శాఖ నాయకులను ఇరుకున పడేలా చేస్తోంది.
నిజానికి- ఏపీలో కూడా ఇదే తరహా డిమాండ్ లేవనెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ అవినీతిపై తాము న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పున:సమీక్షిస్తామని అన్నారు. వైఎస్ జగన్ చేసిన ప్రకటన పట్ల చంద్రబాబు ఉలిక్కిి పడ్డారని, ఈ తతంగం ఆయనను ఇరకాటంలో పడేసేదేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీపీఏలను పున:సమీక్షించడానికి ప్రభుత్వం సిద్ధపడితే.. పరిశ్రమలు రావని, వచ్చినవి కూడా వెనక్కి వెళ్తాయని చంద్రబాబుతో పాటు బీజేపీ నాయకులు సైతం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణలో అక్కడి ప్రభుత్వం.. వందల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోన్న బీజేపీ.. ఏపీలో ఎందుకు వెనుకాడుతోందనేది వైఎస్ఆర్ సీపీ నాయకుల ప్రశ్న. బీజేపీలో ఒకలా.. ఏపీలో ఒకలా.. ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోందని విమర్శిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పీపీఏల్లో కుంభకోణానికి పాల్పడినట్లే ఏపీలో చంద్రబాబు హయాంలో అదే తరహా అవినతి చోటు చేసుకుందని, వాటిని పున:సమీక్షిస్తామంటే బీజేపీ ఎందుకు భుజాలు తడుముకుంటోందని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా పీపీఏల్లో చోటు చేసుకున్న అవినీతిపై ఎందుకు నోరెత్తట్లేదని, న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతోంటే.. ఎందుకు అడ్డుపడేలా ప్రకటనలు చేస్తున్నారని నిలదీస్తున్నారు.