బొత్స సహా వైసీపీ నేతల నిర్బంధం: పల్నాడులో ఉద్రిక్తత, 144 సెక్షన్ అమల్లోకి
Recommended Video
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల నిర్బంధంతో పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. వైసీపీ నేతల గృహ నిర్బంధంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనే నడుస్తోందా? అని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నేతల నిర్బంధం
సోమవారం ఉదయం సున్నపురాయి మైనింగ్ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నిజనిర్ధారణ బృందాన్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దాచేపల్లి, గురజాలలో వైసీపీ నేతల పర్యటన దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సరావుపేలో వైసీపీ నేతలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేశ్రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.
బొత్సను పీఎస్కు తరలించారు..
గుంటూరు జిల్లా దాచేపల్లి మంలం గామాలపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తిని కూడా గృహ నిర్బంధం చేశారు. మంగళగిరి టోల్గేట్ వద్ద మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకుని దుగ్గిరాల పోలీస్స్టేషన్కు తరలించారు. వైసీపీ నేతల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
144సెక్షన్ అమలు
గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచర్లలో 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో నిఘా పెంచారు. వైసీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితి చూడలేదు
కాగా, వైసీపీ నేతల నిర్బంధాలపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా అంతా పోలీస్ నిర్భందంలో ఉందని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ ప్రభుత్వంలో కోర్టు, చట్టం, రాజ్యాంగమంటూ లేవంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్భంద పరిస్థితిని ఎన్నడూ చూడలేదని అన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు గురజాల వెళ్తుంటే ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు. కాగా, దాచేపల్లి, గురజాల ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలను అధికార పక్ష నేతలు కొల్లగొడుతున్నారంటూ వైసీపీ నేతలు కొంతకాలంగా పెద్దయెత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల కొందరికి హైకోర్టు నోటీసులు జారీచేయడంతో వైసీపీ నేతలు ఆరోపణల జోరు పెంచారు. దీనిలో భాగంగానే వైసీపీ నిజనిర్ధారణ బృందం పేరుతో ఆ ప్రాంతంలో పర్యటన చేపట్టారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.