బాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది: కొత్తపల్లి, కెసిఆర్తో రాజీ పడ్డారన్న పద్మ
విజయవాడ/ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం వేర్వేరు మీడియా సమావేశాల్లో తీవ్రంగా మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బరాయుడు, మేకా శేషుబాబు మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడుకు అరెస్టు భయం పట్టుకుందని ఆరోపించారు.
అవినీతి ఆరోపణలపై చంద్రబాబు విచారణ జరిపించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి అరెస్టు భయం పట్టుకుందన్నారు. ఆ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని వారు చెప్పారు. అధికార తెలుగుదేశం పార్టీ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తోందని వారు ఆరోపించారు.
మా నేతలపై పోలీసుల దాడులు దారుణం
రైతుల సమస్యలపై జిల్లాల్లో చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. విశాఖలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన తమ పార్టీ నేతలపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబునాయుడు కేసీఆర్తో రాజీ కోసం కృష్ణా జలాలపై హక్కులను వదిలేశారని ఆరోపించారు.
తెలంగాణ సర్కార్తో కుమ్మక్కై కృష్ణా బోర్డు వద్ద కిమ్మనకుండా ఊరుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు కేసు కోసం ప్రజల ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫణంగా పెట్టొద్దని హితవు వాసిరెడ్డి పద్మ పలికారు.
చంద్రబాబు రాజీనామా చేయాలి
ఓటుకు నోటు వ్యవహారం నుంచి బయటపడేందుకు ఏపి సిఎం చంద్రబాబునాయుడు తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వై విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ పాషా ఆరోపించారు.
చంద్రబాబు నైతిక విలువలకు కట్టుబడి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని నేతలు అన్నారు.
ఇక రాయలసీమ రైతులకు వేరు శెనగ విత్తనాలు సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ విఫలమైందని అనంతర మరో నేత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు సెక్షన్ 8పై గగ్గోలు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు గుర్నాధ్ రెడ్డి అన్నారు.