జగన్పై దాడి: ప్రాణాలు పోయేవి, ‘వెన్నుపోటు-దాడి వరకు’ బాబుపై రాజ్నాథ్కి వైసీపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్.. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
జగన్పై దాడి: రాత్రి వరకు విచారణ, శ్రీనివాస్కి 6రోజుల కస్టడీ, 'చికెన్ బిర్యానీ తెప్పించుకుని..'
జగన్ పై దాడి.. చిన్నదిగా చూపే యత్నం
అంతేగాక, టిట్లీ తుఫాను బాధితులకు కూడా సహాయం అందించాలని కోరారు. హోంమంత్రితో భేటీ అనంతరం మేకపాటి రాజమోమన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్పై జరిగిన హత్యాయత్నాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ‘వైయస్ జగన్పై హత్యాయత్నం ఘటనపై రాజ్నాథ్కు వివరించాం. ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించిన తీరుపై కూడా వివరించాం. చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలను రాజ్నాథ్కు తెలిపాం. ఈ కేసు కేంద్ర పరిధిలో ఉందని చంద్రబాబు చెప్పడంతో.. కేంద్రం ఏం చేయగలదో అది చేస్తామని రాజ్నాథ్ హామీ ఇచ్చారు. హోంమంత్రి సానుకూలంగా స్పందించారు' అని మేకపాటి తెలిపారు.
ఏపీ సర్కారు విఫలం.. ఆపరేషన్ గరుడ వెనుక ఎవరు..?
జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. జగన్కు కేంద్రం సెక్యూరిటీ కల్పించాలని రాజ్నాథ్ను కోరామని తెలిపారు. ఆపరేషన్ గరుడ వెనుక ఎవరున్నారో దానిపై కూడా విచారణ చేయాలని కోరినట్లు తెలిపారు. టిట్లీ తుఫాను ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, బాధితులను ఆదుకోవాల్సిందిగా రాజ్నాథ్ను కోరామని తెలిపారు.
వెన్నుపోటు నుంచి దాడి వరకు.. బాబుపై..
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవితమంతా నేర చరిత్రేనని ఆరోపించారు. నిందితుడిని వైసీపీ సానుభూతిపరుడిగా చూపించే ప్రయత్నం చేస్తోందని టీడీపీపై మండిపడ్డారు. డీజీపీ కూడా అదేరకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ పోలీసులు మినహా ఏ దర్యాప్తు సంస్త విచారణ చేసినా న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు గత చరిత్రపైనా రాజ్నాథ్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని కూడా హోంమంత్రికి వివరించినట్లు తెలిపారు. కేవలం న్యాయమైన దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని కోరుతున్నామని చెప్పారు.
బాబుకు అంత చులకన ఎందుకు?
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి హోంమంత్రికి వివరించామని తెలిపారు. జగన్ పై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు చులకనగా మాట్లాడారని, ఇది కేంద్ర పరిధిలో ఉందని అన్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలను రాజ్నాథ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. హత్యాయత్నంపై కేంద్రం సమగ్ర విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. ఏపీలో ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. డీజీపీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి అద్దంపడుతున్నాయన్నారు. తమ విజ్ఞప్తికి హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
అలా జరిగితే ప్రాణాలు పోయేవి..
వైసీపీ నేత వరప్రసాద్ మాట్లాడుతూ.. తమకు ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని అన్నారు. రిమాండ్ రిపోర్టులో జగన్ పై హత్యాయత్నం జరిగిందని స్పష్టమైందని తెలిపారు. నిందితుడు అనుకున్న విధంగా జరిగి ఉంటే జగన్ ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. అటువంటి అంశాన్ని ప్రభుత్వం, డీజీపీ చిన్నదిగా చూపిస్తున్నారని మండిపడ్డారు. అందుకే కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. మంత్రులు, టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యధిక భద్రత కల్పించాలని కోరామని తెలిపారు. ఏపీ డీజీపీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రిమాండ్ రిపోర్టులో హత్యాయత్నం జరిగినట్లు స్పష్టమైందని అన్నారు. చంద్రబాబు దీన్ని చిన్న ఘటనగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.