మోడీ పేరు ఎత్తాలంటే బాబుకు భయం, నాలుగేళ్లు చూస్తూ కూర్చున్నారు: పార్థసారధి, ధర్మాన ధ్వజం
విజయవాడ: కేంద్ర బడ్జెట్ వచ్చిన పదిహేడు రోజుల తర్వాత సీఎం చంద్రబాబు నోరువిప్పారని, అప్పుడు కూడా ఆయన ప్రధాన మంత్రి మోడీ పేరు ఎత్తడానికే భయపడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి శుక్రవారం విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని ఆయన మండిపడ్డారు.
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి పోరాటం చేయలేదని, ఇప్పుడు ఎవరిపై పోరాటం చేస్తారో స్పష్టం చేయాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటంలో చంద్రబాబు విఫలమై.. ఆ నెపాన్ని ఇతరులపై నెట్టేయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఏపీ ఎంపీలందరూ రాజీనామా చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని పార్థసారథి సూచించారు.
మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నేత ధర్మాన ప్రసాదరావు కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. చట్టసభల సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రానికి ఎలా తాకట్టు పెడుతారని ఆయన చంద్రబాబును నిలదీశారు.
నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కావడంతో చంద్రబాబు లీకులు ఇస్తున్నారని, ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తున్నా.. చంద్రబాబుకు ఆ విషయం పట్టడం లేదని ధర్మాన విమర్శించారు.